ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి అప్పులపాలు కావొద్దు: మంత్రి హరీశ్ రావు

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 02:06 PM

ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి అప్పులపాలు కావొద్దు: మంత్రి హరీశ్  రావు

కరోనా నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాకు అవసరమైన వైద్య సామగ్రి మొత్తం సిద్ధంగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇందుకు అవసరమైన పీపీఈ కిట్లు, ఔషధాలు, ఇంజెక్షన్లు, హోంక్వారంటైన్‌ కిట్లను తెప్పించామని వెల్లడించారు. కిట్లు లేవనే వదంతులు, సాకులను ప్రజలు నమ్మవద్దని సూచించారు. సంగారెడ్డిలో అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు కీలక ఆదేశాలు చేశారు.

రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) కొవిడ్‌ పరీక్షలను నిర్వహించాలని, లేకపోతే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. కొవిడ్‌ బాధితులను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవడం సరికాదని చెప్పారు. ఇలాంటి ఘటనలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని.. ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి అప్పులపాలు కావొద్దని ప్రజలకు ఆయన సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎలాంటి చికిత్స అందిస్తున్నారో.. అదే వైద్యం ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని వివరించారు.

‘‘కరోనా రాకుండా రోజూ వేడి నీళ్లు తాగాలి. ఆవిరి పట్టాలి. మాస్కులు తప్పకుండా ధరించాలి. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటివి వస్తే ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలని’’ మంత్రి హరీశ్‌రావు సూచించారు.

కలెక్టర్, ఎస్పీ, జిల్లా వైద్య శాఖ సిబ్బంది, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌ తదితరులు టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.





Untitled Document
Advertisements