పాక్ బ్యాట్స్‌మెన్‌పై సోషల్ మీడియాలో పేలుతున్న జోక్‌లు

     Written by : smtv Desk | Fri, Aug 14, 2020, 10:08 AM

పాక్ బ్యాట్స్‌మెన్‌పై  సోషల్ మీడియాలో పేలుతున్న జోక్‌లు

పాకిస్థాన్ జట్టులోకి దశాబ్దం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ పవాద్ అలామ్.. క్రీజులో చిత్రమైన స్టాన్స్‌తో వార్తల్లో నిలిచాడు. 2009లో ఆఖరిగా పాకిస్థాన్ తరఫున టెస్టులు ఆడి న పవాద్ అలామ్.. ఇంగ్లాండ్‌తో సౌథాంప్టన్ వేదికగా గురువారం ఆరంభమైన రెండో టెస్టులో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేశాడు.



ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు.. 42.3 ఓవర్లు ముగిసే సమయానికి 117/4తో నిలిచిన దశలో క్రీజులోకి వచ్చిన పవాద్ అలామ్.. 4 బంతులు ఎదుర్కొని ఫాస్ట్ బౌలర్ క్రిస్‌ వోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన అతను కనీసం పరుగుల ఖాతా కూడా తెరవకుండా డకౌట్‌గా ఔటవడంతో.. అతని కెరీర్ మళ్లీ ప్రశ్నార్థకంలో పడిపోయింది.


ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన పవాద్ అలామ్.. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ శివనరైన్ చందర్‌పాల్ తరహాలో బ్యాటింగ్ స్టాన్స్ తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కొత్త స్టాన్స్ కారణంగా క్రీజులో సౌకర్యంగా కదల్లేకపోయిన పవాద్ అలామ్.. ఆఫ్ స్టంప్‌ లైన్‌కి వెళ్లి బంతిని ఆడే ప్రయత్నం చేశాడు. కానీ.. ఆ క్రమంలో క్రిస్‌వోక్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు.




వాస్తవానికి పవాద్ అలామ్ చిత్రమైన స్టాన్స్ కారణంగా తికమకకి గురైన ఫీల్డ్ అంపైర్ తొలుత ఎల్బీడబ్ల్యూ ఔట్ ఇవ్వలేదు. అయితే.. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ డీఆర్‌ఎస్ కోరగా.. బంతి మిడిల్ స్టంప్‌ని తాకేలా రిప్లైలో కనిపించింది. దాంతో.. అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. పవాద్ అలామ్ స్టాన్స్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు జోక్‌లు పేల్చుతున్నారు. రెండో టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. వర్షం కారణంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 126/5తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో బాబర్ అజామ్ (25 బ్యాటింగ్: 51 బంతుల్లో 1x4), మహ్మద్ రిజ్వాన్ (4 బ్యాటింగ్: 5 బంతుల్లో) ఉండగా.. తొలి రోజు వర్షం కారణంగా కేవలం 45.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.






Untitled Document
Advertisements