రూ.2 వేల నోట్లపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం

     Written by : smtv Desk | Sun, Sep 20, 2020, 01:33 PM

రూ.2 వేల నోట్లపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం

రూ.2 వేల నోట్లపై వదంతులు వస్తూనే ఉన్నాయి. ఈ కరెన్సీ నోట్లు మార్కెట్‌లోకి వచ్చిన దగ్గరి నుంచి ఏదో ఒక అంశంలో వార్తల్లో నిలుస్తూనే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్లను రద్దు చేస్తోంది.. మోదీ సర్కార్ రూ.2 వేల నోట్లలో చిప్ పెట్టింది.. ప్రభుత్వం రూ.2 వేల నోట్ల ప్రింటింగ్‌ను ఆపేసింది.. ఇలా ఎన్నో రకాల రూమర్లు వింటూనే ఉంటాం.

అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల నోట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2,000 నోట్ల ప్రింటింగ్‌ను నిలిపివేసే ఆలోచన లేదని, అందుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆర్థిక శాఖ శనివారం లోక్ సభలో ఈ విషయాన్ని వెల్లడించింది.

ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ రూ.2,000 నోట్ల ప్రింటింగ్‌కు సంబంధించిన ప్రశ్నకు లోక్ సభలో లిఖిత పూర్వ సమాధానం ఇచ్చారు. కరెన్సీ నోట్ల ప్రింటింగ్ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తో సంప్రదింపులు జరిపి తర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకుంటుందని వివరించారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా అన్ని రకాల కరెన్సీ నోట్లు అందుబాటులో ఉండేలా చూసుకుంటుందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వానికి రూ.2,000 నోట్ల ముద్రణను నిలిపివేయాలనే ఆలోచన లేదని, దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. 2020 మార్చి 31 నాటికి 27,398 లక్షల రూ.2 వేల నోట్లు చెలామణిలో ఉన్నాయని తెలిపారు. అయితే 2019 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లు 32,910 లక్షలుగా ఉన్నాయని పేర్కొన్నారు.

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధింపు కారణంగా రిజర్వు బ్యాంక్ ప్రస్తుతానికి కరెన్సీ నోట్లను ముద్రించడం లేదని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అయితే ఇది తాత్కాలికమే అని పేర్కొన్నారు. ఇకపోతే రూ.2 వేల నోట్ల ముద్రణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చిన నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దు.





Untitled Document
Advertisements