రాజ్యసభ: 8 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్

     Written by : smtv Desk | Mon, Sep 21, 2020, 05:01 PM

రాజ్యసభ: 8 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్

రాజ్యసభలో వివాదాస్పద వ్యవసాయ రంగ సంస్కరణ బిల్లులపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకున్న విషయం తెలిసిందే. బిల్లులపై చర్చ సందర్భంగా రాజ్యసభ రణరంగాన్ని తలపించింది. ఒకదశలో తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు డెరెక్‌ ఓబ్రియెన్‌ ఆవేశంగా పోడియం వద్దకు దూసుకొచ్చి, సభా నిబంధనల పుస్తకాన్ని డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ మీదికి విసిరికొట్టారు. కోపంగా బిల్లు ప్రతుల్ని చించి విసిరేయడంతోపాటు మైకుల్ని బలవంతంగా లాక్కోవాలని చూశారు. ఈ ప్రయత్నాలను మార్షల్స్‌ అడ్డుకున్నారు.

ఈ బిల్లును అడ్డుకోవడానికి విపక్షాలు చేసిన ప్రయత్నాలను మార్షల్స్‌ సాయంతో అధికారపక్షం నిర్వీర్యం చేసింది. బిల్లు ఉపసంహరించుకోవాలని, లేదంటే సెలెక్ట్‌ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు చేసిన డిమాండ్లను తోసిపుచ్చుతూ ప్రభుత్వం రెండు బిల్లులను మూజువాణి ఓటుతో నెగ్గించుకుంది. బిల్లుల విషయంలో మూజువాణి ఓటింగ్ నిర్వహించడం పట్ల సభలో గలాటా సృష్టించిన ప్రతిపక్ష సభ్యులపై చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు చర్యలు తీసుకున్నారు. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే మొత్తం ఎనిమిది మంది ఎంపీలను వారం రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వెంకయ్య ప్రకటించారు.

ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ పట్ల విపక్ష సభ్యులు ‘అనుచితంగా’ వ్యవహరించారనీ... దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాననీ చైర్మన్ వెంకయ్య పేర్కొన్నారు. సస్పెండ్ అయినవారిలో టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓ బ్రైన్, సంజయ్ సింగ్, రాజు సతవ్, కెకె రగేష్, రిపున్ బోరా, డోలా సేన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, ఎలమరన్ కరీంలు ఉన్నారు.

మరోవైపు, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్ సింగ్‌పై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. మొత్తం 12 పార్టీలకు చెందిన 50 మంది ఈ తీర్మానంపై సంతకాలు చేశారు.





Untitled Document
Advertisements