పాక్ లో మతమార్పిడి: సిక్కు అమ్మాయి కిడ్నాప్, బలవంతంగా పెళ్లి!

     Written by : smtv Desk | Mon, Sep 21, 2020, 07:08 PM

పాక్ లో మతమార్పిడి: సిక్కు అమ్మాయి కిడ్నాప్, బలవంతంగా పెళ్లి!

చెత్త పడేయడానికి ఆరు బయటకు వెళ్లిన ఆ సిక్కు అమ్మాయి తిరిగి ఇంటికి రాలేదు. తమ కుమార్తె ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. చివరికి ఏ వార్త వినాల్సి వస్తుందోనని వారు భయాందోళనకు గురయ్యారో అదే జరిగింది. ఆ బాలికను కిడ్నాప్ చేసి మత మార్పిడి చేయించి, పెళ్లి చేసుకున్నట్లు వారి మొబైల్ ఫోన్‌కు వాట్సాప్ సందేశం వచ్చింది. పాకిస్థాన్‌లో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మైనర్టీ వర్గాలైన హిందూ, క్రైస్తవ మతాలకు చెందిన యువతులను అపహరించి బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అక్కడి పోలీసులు, న్యాయ వ్యవస్థ దీనికి ఎలాంటి పరిష్కారాలు చూపడం లేదు.

పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో అట్టోక్ జిల్లాలోని హసన్‌అబ్దల్ పట్టణంలో సిక్కు ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు. ప్రఖ్యాత ‘పంజా సాహిబ్’ గురుద్వారాకు ఈ పట్టణం పేరు పొందింది. పట్టణంలో నివాసం ఉండే ఓ సిక్కు వ్యక్తి గురుద్వారా సమీపంలో ఓ షాపు నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 22 ఏళ్ల అతడి కుమార్తె కొన్ని రోజుల కిందట చెత్త పారేయడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేదు. బంధువుల సాయంతో గాలించినా ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు చేసిన మరుసటి రోజు యువతి తల్లిదండ్రులకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తాను తన ఇష్టానుసారంగానే ఇస్లాం మతాన్ని స్వీకరించానని ఆమె చెప్పినట్లుగా అందులో ఉంది. మతం మారిన తర్వాత ఆ యువతి స్థానిక ముస్లిం యువకుడిని వివాహం చేస్తున్నట్లు ‘ది డాన్’ పత్రిక ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది.

అమ్మాయి ఆచూకీ దొరికితే గానీ.. ఆమె కిడ్నాప్‌కు గురైందా, లేదా అనే అంశంపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. వాట్సాప్ సందేశంలోని వాయిస్ రికార్డ్ బాధితురాలు పంపించిందేనా? ఒకవేళ అది ఆమె గొంతే అయితే.. ఎవరైనా బెదిరించి అలా చేయించారా, లేదా తన ఇష్టంతోనే వెళ్లిపోయిందా అనే విషయాలు దర్యాప్తులో తేలుతాయని వారు తెలిపారు. యువతి తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని కోరుతూ పాకిస్థాన్ న్యాయ మంత్రి నూరుల్ హక్ ఖాద్రీని కలిశారు.

గత ఏడాది నంకనాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. స్థానిక గురుద్వారా తంబూ సాహిబ్ ముఖ్య గ్రంథి కుమార్తెను కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెకు బలవంతంగా మతం మార్పించి పెళ్లి జరిపించారు. ఈ ఘటన తర్వాత నంకనా సాహిబ్‌లో చాలా రోజులపాటు ఉద్రిక్తత నెలకొంది.

తాజా ఘటన పాకిస్థాన్‌లో మైనారిటీలు ప్రమాదంలో పడిపోయారనే అంశాన్ని స్పష్టం చేస్తోంది. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలోని హసన్అబ్దల్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మైనారిటీ వర్గాలకు చెందిన అమ్మాయిలు ప్రమాదకర స్థితిని ఎదుర్కొంటున్నారు. హిందూ, క్రైస్తవ మతాలకు చెందిన అమ్మాయిలను కిడ్నాప్ చేసి బలవంతంగా మతం మార్పించి, పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది మైనర్ బాలికలే ఉంటుండటం మరింత ఆందోళన కలిగించే అంశం.

మైనారిటీ యువతులను కిడ్నాప్ చేసిన అనంతరం వారిని బెదిరించి, హింసకు గురిచేసి మతం మార్పిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. వారితో బలవంతంగా మతం మార్చుకున్నట్లు చెప్పించి ముస్లిం యువకుడితో పెళ్లి జరిపిస్తున్నారు. పెళ్లికి అంగీకరించకపోతే అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడి మరీ బలవంతంగా వివాహం చేసుకుంటున్నట్లు గతంలో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తోంది. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యునైటెడ్ స్టేట్స్ కమిషన్ గణాంకాల ప్రకారం.. పాకిస్థాన్‌లో ఏటా 1000 మందికి పైగా మైనారిటీ అమ్మాయిలు కిడ్నాప్‌కు గురవుతున్నారు. వీరంతా 12 నుంచి 28 సంవత్సరాల మధ్య వయుసు వారే.





Untitled Document
Advertisements