తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతుంది. గత కొద్ది రోజులుగా భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నా ఇప్పుడిప్పుడే అది కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. తాజాగా గడిచిన 24 గంటలలో 2,296 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 10 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 2,062 మంది డిశ్చార్జ్ అయ్యారు.
అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,77,070 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,46,135 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 29,873 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1062 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 55,892 మంది శాంపిల్స్ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 26,28,897 టెస్ట్లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 82.52 శాతం ఉండగా, మరణాల రేటు 0.59% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.