రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఎన్‌సీబీ సోదాలు

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 04:56 PM

రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఎన్‌సీబీ సోదాలు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విచారణలో భాగంగా బయటపడిన ‘డ్రగ్స్ వాడకం’ బాలీవుడ్‌లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. సుశాంత్ మృతి కేసులో రియా చక్రవర్తిని పోలీసులు విచారించినప్పుడు ఆమె వాట్సాప్ చాట్ ఆధారంగా డ్రగ్స్ వాడినట్టు గుర్తించారు. అక్కడ తీగ లాగితే బాలీవుడ్ డొంకంతా కదిలింది. ఈ డ్రగ్స్ కేసులో పాపులర్ స్టార్స్ ఉన్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు గుర్తించారు. సుశాంత్ మాజీ టాలెంట్ మేనేజర్ జయ సాహాను ఎన్‌సీబీ అధికారులు విచారించినప్పుడు ఆయన పలువురు హీరోయిన్ల పేర్లు చెప్పినట్టు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవే నిజమయ్యాయి.

బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ సహా రకుల్ ప్రీత్‌సింగ్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమన్లు జారీ చేసింది. మూడు రోజుల్లో తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, రకుల్‌కు ఎలాంటి నోటిసులు అందలేని ఆమె టీమ్ మొదట ప్రకటించింది. హైదరాబాద్‌లో కానీ.. ముంబైలో కానీ తనకు ఎన్‌సీబీ పంపిన సమన్లు అందలేని తెలిపింది. ఈ మేరకు రకుల్‌ ప్రీత్‌ మేనేజర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

అయితే, రకుల్ ప్రీత్ సింగ్ మేనేజర్ ఇచ్చిన ప్రకటనను ఎన్‌సీబీ ఖండించింది. ఆమె సమన్లు అందినట్టు ఎన్‌సీబీ అధికారి కేపీఎస్ మల్హోత్ర గురువారం వెల్లడించారు. ‘‘రకుల్ ప్రీత్ సింగ్‌కు సమన్లు జారీ చేశాం. అంతేకాకుండా, ఆమెను ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాం. అలాగే, పలు ప్లాట్‌ఫాంల ద్వారా కూడా ఆమెను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాం. కానీ, ఆమె అందుబాటులోకి రాలేదు. ఆమె నుంచి ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు’’ అని మల్హోత్ర అన్నారు.

అంతేకాకుండా రకుల్ ప్రీత్ తమని తప్పుదారి పట్టిస్తున్నారని.. ఆమె హైదరాబాద్‌లో ఉన్నారా లేక ముంబైలో ఉన్నారా అనే విషయం తమకు తెలియదని ఎన్‌సీబీ అధికారి అన్నారు. ఒకవేళ రకుల్ రేపు విచారణకు హాజరుకాకపోయినా.. ఏవైనా సాకులు చెప్పినా ఆమెకి నాన్‌ బెయిలబుల్‌ సమన్లు జారీ చేస్తామని హెచ్చరించారు. ఎన్‌సీబీ నుంచి హెచ్చరిక రాగానే రకుల్ ప్రీత్ సింగ్ మాట మార్చారు. తనకు సమన్లు అందలేదంటూ ప్రకటన విడుదల చేసిన రకుల్‌.. ఇప్పుడు అందాయని ప్రకటించారు. ఆమె రేపు (సెప్టెంబర్ 25న) విచారణ హాజరయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుత సమాచారం ప్రకారం దీపికా పదుకొనె రేపు (సెప్టెంబర్ 25న).. సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ శనివారం (సెప్టెంబర్ 26)న ఎన్‌సీబీ ముందు విచారణకు హాజరవుతారు. దీపికా పదుకొనెతో పాటు రకుల్ కూడా రేపే విచారణకు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే, ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లో లేదు. ఈరోజే ముంబై బయలుదేరి వెళ్లినట్టు సమాచారం. ఇదిలా ఉంటే, గురువారం ముంబైలోని రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఎన్‌సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సమన్లు పంపినా సమాధానం లేకపోవడం, ఈరోజు విచారణకు హాజరుకాకపోవడం వల్లే ఎన్‌సీబీ అధికారులు రకుల్ ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు తెలిసింది.





Untitled Document
Advertisements