చైనా సాయంతో కశ్మీర్‌లో మారణ హోమానికి పాక్ కుట్ర

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 01:48 PM

చైనా సాయంతో కశ్మీర్‌లో మారణ హోమానికి పాక్ కుట్ర

ఓవైపు తూర్పు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత భూభాగంలోకి చొచ్చుకొస్తున్న చైనా.. మరోవైపు, జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు పెద్ద సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను డ్రాగన్ ప్రోద్బలంతోనే పాకిస్థాన్ చేరవేస్తుందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. జమ్మూ కశ్మీర్‌లో మారణహోమానికి చైనా కనుసన్నల్లోనే పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ కుట్ర పన్నుతోందని నిఘా వర్గాలు తెలిపాయి. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లో భద్రత దళాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఎక్కువ చైనావే ఉన్నాయని వివరించాయి.

‘కశ్మీర్‌లోకి ఉగ్రవాదులు, ఆయుధాలను చేరవేసి హింసను ప్రేరేపించేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొడుతోంది.. రబాట్లు సంభవించే ప్రాంతాలలో మంచు, హిమపాతం కారణంగా ప్రాణాలు కోల్పోతారు.. దీంతో, చలికాలం ప్రారంభానికి ముందే పెద్ద సంఖ్యలో ఉగ్రవాదుల ఎగదోయడమే ఐఎస్ఐ లక్ష్యంగా పెట్టుకుంది’అని నిఘా వర్గాలు వ్యాఖ్యానించాయి.

నిఘా వర్గాల హెచ్చరికలతో నియంత్రణ రేఖ వెంబడి యాంటీ-ఇన్‌ఫిల్ట్రేషన్ గ్రిడ్‌ను సైన్యం పటిష్టం చేసింది. గత పది రోజుల్లో ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే, బీఎస్ఎఫ్ చీఫ్ రాకేశ్ ఆస్థానా, సీఆర్పీఎఫ్ డీజీ ఏపీ మహేశ్వరీ జమ్మూ కశ్మీర్‌లో పర్యటించి, పరిస్థితి సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. జమ్మూ కశ్మీర్‌లో కార్యకలాపాల నిర్వహిస్తున్న అధికారులు, భారత భద్రతా దళాలు అనుసరిస్తున్న ఎంగేజ్‌మెంట్ నిబంధనలను (ఆర్‌ఓఇ) ఐఎస్ఐ విశ్లేషించిందని ఇటీవలి సంఘటనలు సూచిస్తున్నాయి.

ఎల్ఓసీ వద్ద ఎటువంటి కాల్పులకు పాల్పడటం లేదు.. సైన్యానికి అనుమానం రాకుండా ఆయుధాలు లేని ఉగ్రవాదులను దేశంలోకి పంపుతున్నారు.. తర్వాత ఆయుధాలను డ్రోన్లు, ఇతర మార్గాల ద్వారా అందజేస్తున్నారు’ అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఇక, కశ్మీర్‌ లోయలోనూ స్థానిక రిక్రూట్‌మెంట్లు పెరిగాయని నిఘా వర్గాల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గత రెండు నెలలు నుంచి భారీగా రిక్రూట్‌మెంట్లు పెరిగాయి.. కానీ ఆయుధాలు పొందడమే ప్రధాన అంశం.. ప్రస్తుతం వీరికి డ్రోన్ల ద్వారా ఆయుధాలను పాక్ పంపుతోందని పేర్కొన్నారు.

చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఇసీ) ఆస్తులను పరిరక్షించాలనే వంకతో చైనా సంస్థ నుంచి పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ భారీ సంఖ్యలో హెక్సాకాప్టర్లను కొనుగోలు చేసిందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేశాయి. చైనా ఆయుధాల సంస్థ నోరింకో ఉత్పత్తి చేసిన ఈఎంఈఐ 97 ఎన్ఎస్‌ర్ రైఫిల్స్‌ను సైన్యం ఇటీవల భారీ సంఖ్యలో స్వాధీనం చేసుకుందని ప్రభుత్వ నివేదిక తెలియజేస్తోంది.





Untitled Document
Advertisements