త్రివిక్రమ్ దర్శకత్వంలో సెట్స్ పైకి ఎన్టీఆర్ 30వ చిత్రం

     Written by : smtv Desk | Sat, Jan 02, 2021, 12:47 PM

త్రివిక్రమ్ దర్శకత్వంలో సెట్స్ పైకి ఎన్టీఆర్ 30వ చిత్రం

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ మూవీ రానున్న సంగతి తెలిసిందే. గతేడాది ఆరంభంలోనే ‘అల వైకుంఠపురంలో’ విజయం తన ఖాతాలో వేసుకొని మంచి ఊపులో ఉన్న త్రివిక్రమ్.. ఈ ఏడాది ఎన్టీఆర్‌తో మరో భారీ సినిమా ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎన్టీఆర్- త్రివిక్రమ్ మీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

న్యూ ఇయర్ సందర్భంగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకొని సరదాగా కాసేపు ముచ్చటించుకున్నారు. తమ అప్‌కమింగ్ సినిమాపై ఈ ఇద్దరూ కొన్ని ఆలోచనలు పంచుకున్నట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ సంద‌ర్భంగా నిన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిసిన త్రివిక్ర‌మ్ ఈ రోజు ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి స్వ‌యంగా ఆయన్ను కలవడం విశేషం. ప్రస్తుతం వీరిద్దరి మీట్ తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇలా ఎన్టీఆర్- త్రివిక్రమ్ మీట్ అయిన ఫొటోలను హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ త‌మ ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ.. న్యూ ఇయర్ ఎనర్జిటిక్ డే 2 అని తెలిపారు. అలాగే త్వ‌ర‌లోనే ఎన్టీఆర్ 30వ చిత్రం సెట్స్ పైకి రానుందని పేర్కొంటూ నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్టీఆర్ 30వ సినిమాగా రానున్న ఈ మూవీకి ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ అనుకుంటున్నట్లు టాక్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, యన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్. రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్‌రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు. ఈ మూవీలో విలన్‌గా కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర నటించనున్నారని తెలుస్తుండటం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏదేమైనా షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొనడం గమనార్హం.






Untitled Document
Advertisements