దాదాకి గుండె‌పోటు... 9 మందితో మెడికల్ బోర్డు ఏర్పాటు

     Written by : smtv Desk | Mon, Jan 04, 2021, 02:02 PM

దాదాకి గుండె‌పోటు... 9 మందితో మెడికల్ బోర్డు ఏర్పాటు

గుండె‌పోటుతో ఆసుపత్రిలో చేరిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరో యాంజియో‌ప్లాస్టీ నిర్వహించబోతున్నారు. గత శనివారం ఉదయం జిమ్‌లో వ్యాయమం చేస్తుండగా.. గంగూలీకి స్వల్ప గుండెపోటు వచ్చింది. దాంతో.. కుటుంబ సభ్యులు హుటాహుటిన కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్‌ ఆసుపత్రికి తరలించారు. దాదా గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు.. ఆరోజే యాంజియో‌ప్లాస్టీ నిర్వహించారు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ.. శనివారం పూడికని తొలగించడం కోసం స్టంట్ వేసిన వైద్యులు.. మరో యాంజియో‌ప్లాస్టీ నిర్వహించడంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

సౌరవ్ గంగూలీ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు బులెటిన్‌ని విడుదల చేస్తున్న వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి.. తాజాగా 9 మందితో ఒక మెడికల్ బోర్డుని ఏర్పాటు చేసింది. సోమవారం సమావేశంకానున్న ఈ బోర్డు.. గంగూలీకి మరో యాంజియో‌ప్లాస్టీ నిర్వహించడంపై చర్చించబోతోంది. దాదా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో స్పందించిన విషయం తెలిసిందే.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సౌరవ్ గంగూలీతో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. అలానే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేరుగా ఆసుపత్రికి వెళ్లి దాదాతో మాట్లాడటంతో పాటు.. వైద్యులతోనూ అతని ఆరోగ్యంపై చర్చించారు. ఇక సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తదితర క్రికెటర్లు గంగూలీ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ ట్వీట్స్ చేశారు.





Untitled Document
Advertisements