ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు డౌటే!?

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 01:48 PM

ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు డౌటే!?

ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవల బయో- సెక్యూర్ బబుల్ రూల్స్‌ని బ్రేక్ చేసి విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా.. నాలుగో టెస్టుకి ముందు క్వారంటైన్‌లో ఉండబోమని స్పష్టం చేసింది. సిడ్నీ వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. ఆ తర్వా త ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్ వేదికగా నాలుగో టెస్టు జరగనుంది. అయితే.. సిడ్నీలో కరోనా వైరస్ వ్యాప్తి గత కొద్దిరోజులుగా పెరగడంతో.. నాలుగో టెస్టు కోసం బ్రిస్బేన్‌కి టీమిండియా వెళ్లిన తర్వాత కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉండాలని అక్కడి ప్రభుత్వం చెప్తోంది.

ఆస్ట్రేలియా కఠిన నిబంధనల్ని వ్యతిరేకిస్తున్న టీమిండియా.. సిడ్నీలోనే నాలుగో టెస్టుని నిర్వహించాలని తాజాగా ప్రతిపాదించింది. ఒకవేళ అది సాధ్యంకాకపోతే.. బ్రిస్బేన్‌కి చేరుకున్న తర్వాత మళ్లీ తాము క్వారంటైన్‌లో ఉండబోమని స్పష్టం చేసింది. దాంతో.. ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎటూ తేల్చుకోలేకపోతోంది. బ్రిస్బేన్‌కి నాలుగో టెస్టు కోసం భారత క్రికెటర్లు వస్తే..? తప్పకుండా అక్కడి ప్రభుత్వ నిబంధనల్ని పాటించాలని ఇటీవల క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దలు గట్టిగా చెప్పిన విషయం తెలిసిందే. సిరీస్ కోసం ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన వెంటనే 14 రోజులు క్వారంటైన్‌లో భారత క్రికెటర్లు ఉన్న విషయం తెలిసిందే.


‘‘సిడ్నీ లేదా బ్రిస్బేన్‌లో నాలుగో టెస్టుని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించుకోవచ్చు. టీమిండియాకి ఎలాంటి అభ్యంతరం లేదు. ఒకవేళ బ్రిస్బేన్‌లోనే ఆ మ్యాచ్‌ని నిర్వహించి.. టీమిండియాని మరోసారి క్వారంటైన్‌లో ఉండాలని చెప్తే మాత్రం ఒప్పుకోం. అలా అయితే సిడ్నీలోనే నాలుగో టెస్టుని నిర్వహించాలి. అది సాధ్యం కాదంటే..? నాలుగు టెస్టుల ఈ సిరీస్‌ని మూడు టెస్టులకే కుదించాలి. అప్పుడు టీమిండియా స్వదేశానికి వెళ్లిపోతుంది’’ అని టీమిండియా మేనేజ్‌మెంట్ అధికారి ఒకరు తెలిపారు.





Untitled Document
Advertisements