థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ...తెలుగు సీఎంలకు నిర్మాతల రిక్వెస్ట్

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 03:10 PM

థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ...తెలుగు సీఎంలకు నిర్మాతల రిక్వెస్ట్

సంక్రాంతి సందర్భంగా విడుదలవుతోన్న భారీ చిత్రాలను దృష్టిలో ఉంచుకుని థియేటర్లలో 100 శాతం సీటింగ్ సామర్థ్యాన్ని అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తమిళనాడు మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వాలని తెలుగు నిర్మాతల మండలి విజ్ఞప్తి చేస్తోంది. ఈ మేరకు తెలుగు నిర్మాతల మండలి తరఫున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలకు వినతిపత్రం అందజేశారు.

‘‘50 శాతం సీటింగ్ సామర్థ్యంతో కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు గత కొద్దిరోజుల క్రితం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేశాయి. కానీ 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడపడం వల్ల థియేటర్ల నిర్వహణకు ఎక్కవ ఖర్చు అవుతుంది, దీని వల్ల థియేటర్ల యాజమాన్యాలు నష్టాలను భరించాల్సి వస్తుంది.

కానీ ఇప్పుడు సినిమా థియేటర్లలో సీటింగ్ సామర్థ్యంను 50 శాతం నుంచి 100 శాతంకు పెంచుతూ, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ థియేటర్లు నడుపుకునేందుకు అనుమతిస్తున్నట్లు ఈనెల 4న తేదీన తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. కరోనా కేసులు రోజురోజుకి తగ్గుతున్న క్రమంలో థియేటర్ల యాజమాన్యాలు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకుని తమిళనాడు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

తమిళనాడు ప్రభుత్వం తరహాలో తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతం పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గౌరవ ముఖ్యమంత్రులు, గౌరవ మంత్రులు, ప్రభుత్వ విభాగాధిపతులను తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తరపున అభ్యర్థిస్తున్నాం. ఈ నిర్ణయం తీసుకుంటే సినిమా థియేటర్ల నిర్వహణకు, సినీ పరిశ్రమకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది’’ అని వినతి పత్రంలో పేర్కొన్నారు. వీరి విన్నపానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎలా స్పందిస్తారో చూడాలి.





Untitled Document
Advertisements