రూ.లక్ష కోట్లతో కొత్త బ్యాంక్ ఏర్పాటులో కేంద్రం

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 04:16 PM

రూ.లక్ష కోట్లతో కొత్త బ్యాంక్ ఏర్పాటులో కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తోంది. కొత్త బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీని ద్వారా పోర్టులు, రోడ్లు, పవర్ ప్రాజెక్టులు వంటి వాటికి డబ్బులు అందించాలని ప్లాన్ చేస్తోంది. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన భారత్‌ను మాంద్యం నుంచి పైకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. అందుకే ఈ కొత్త బ్యాంక్ తీసుకురావాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2021లో ఈ అంశానికి సంబంధించి ప్రకటన ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. రూ.లక్ష కోట్లతో దీని ఏర్పాటు జరగొచ్చు. ఇప్పటికే ఉన్నటువంటి ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీని ఈ కొత్త బ్యాంక్‌లోనే విలీనం చేయనున్నారు.

తొలిగా కేంద్ర ప్రభుత్వం ఈ బ్యాంక్‌కు నిధులు సమకూరుస్తుంది. తర్వాత ఇన్వెస్టర్లు ఈ బ్యాంక్‌లో వాటాలు కొనుగోలు చేయొచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్థిక శాఖ కూడా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఒక నోట్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది. మోదీ కేబినెట్ మీటింగ్‌లో దీనిపై చర్చ జరగొచ్చు.

ఆర్థిక అభివృద్ధికి దోహదపడే ఉత్పాదకతను అందించే రంగాలపై డబ్బులు ఇన్వెస్ట్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కరోనా వైరస్ దెబ్బకి గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఉద్దీపణ ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం ఇప్పుడు ఇబ్బందులు పడుతోంది. అలాగే వచ్చే ఐదేళ్ల కాలంలో రోడ్లు, రైలు, ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై 1.5 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయాలంటే కచ్చితంగా మోదీ ప్రభుత్వం విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించాలి.





Untitled Document
Advertisements