జనవరి 26న మహిళా రైతుల ట్రాక్టర్ల ర్యాలీ

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 02:16 PM

జనవరి 26న మహిళా రైతుల ట్రాక్టర్ల ర్యాలీ

ట్రాక్టర్ల ర్యాలీకి రైతులు సిద్ధమవుతున్నారు. తామేం తక్కువ కాదంటూ మహిళా రైతులు కూడా ముందుకొస్తున్నారు. సింఘు సరిహద్దులో శిక్షణా కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. యుద్ధంలో పాల్గొనడానికి వెళ్లే సైనికుడిలా నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


కేంద్రం రూపొందించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు సమస్యను పరిష్కరించకుంటే.. ఉద్యమం ఉదృతం చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. ఇందుకోసం సన్నాహకాలు ప్రారంభించారు.

సింఘు సరిహద్దులో ఆందోళనలు నిర్వహిస్తున్న ప్రాంతానికి సమీపంలో గురువారం (జనవరి 7) ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. రైతులకు డ్రైవింగ్‌లో శిక్షణ కూడా ఇస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవింగ్‌ నేర్చుకోవడంలో ఆసక్తి ఉన్నవారు సింఘు సరిహద్దుకు రావాలని రైతు సంఘాలు ఇప్పటికే పిలుపునిచ్చాయి. ఈ పిలుపు అందుకొని చాలా మంది రైతులు ముందుకొచ్చారు. వీరిలో పలువురు మహిళా రైతులు ఉన్నారు.

‘మహిళం మగవాళ్లకు ఎందులో తీసుపోం..’ అని 45 ఏళ్ల హర్జీత్ కౌర్ అన్నారు. ట్రాక్టర్‌ను ఆమె జోరుగా ముందుకు ఉరికిస్తున్నారు. హర్దయాల్ సింగ్ (57) అనే రైతు వీరికి ట్రాక్టర్లను నడపడంలో శిక్షణ ఇస్తున్నారు.



‘ఆడవాళ్లు గృహిణిగా ఇంటి పనులు చూసుకోవడమే కాదు.. అవసరం వచ్చినప్పుడు ఎలాంటి సాహసానికైనా వెనుకాడరు. జనవరి 26న ట్రాక్టర్ల ర్యాలీ కోసం వారు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు’ అని హర్దయాల్ అన్నారు.


పాటియాలకు చెందిన 62 ఏళ్ల ఓ మహిళ కొన్ని రోజుల కిందట 250 కి.మీ. దూరం జీపు నడిపి దేశం దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఆ వాహనంలో ఆమెతో పాటు మరో ఐదుగురు రైతులు ఆందోళనలు జరుగుతున్న సింఘు సరిహద్దుకు చేరుకున్నారు.





Untitled Document
Advertisements