శవంతో ఆస్పత్రి వ్యాపారం...అడ్వాన్స్ తీసుకున్నాక చనిపోయిందని హైడ్రామా?!

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 02:50 PM

శవంతో ఆస్పత్రి వ్యాపారం...అడ్వాన్స్ తీసుకున్నాక చనిపోయిందని హైడ్రామా?!

ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ ప్రాణం పోయినా డబ్బుల కోసం పీక్కుతింటున్న అత్యంత అమానుష ఘటన వెలుగుచూసింది. అడ్వాన్స్‌గా లక్షన్నర కట్టించుకుని.. రాత్రికి చనిపోయిందని చెప్పారు. ఉదయం డెడ్‌బాడీ ఇచ్చేందుకు రేటు ఫిక్స్ చేసి శవంతో వ్యాపారం మొదలెట్టారు. కట్టి తీరాల్సిందేనని చెప్పడంతో ఆగ్రహం చెందిన బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈ దారుణ ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది.
వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం గట్ల కనపర్తి గ్రామానికి చెందిన నాటి ప్రమీల (65)కు హార్ట్ స్ట్రోక్ రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిన్న మద్యాహ్నం సమయంలో చేరిన వెంటనే పేషెంట్ వైద్యం కోసం అడ్వాన్స్‌గా రూ.లక్షా యాభై వేలు ఆసుపత్రి యాజమాన్యం కట్టించుకుంది. రాత్రి రాత్రి పదకొండు గంటల సమయంలో పేషెంట్ మృతి చెందినట్లు హాస్పిటల్ సిబ్బంది బంధువులకు తెలిపారు.

అక్కడి నుంచి అసలు డ్రామా మొదలైంది. ఉదయం డెడ్ బాడీ ఇవ్వాలంటే మరో రెండు లక్షల ఇరవై వేల రూపాయలు చెల్లించాలని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. లేకుంటే మృతదేహం ఇచ్చేది లేదని ఆసుపత్రి యాజమాన్యం ఖరాఖండిగా చెప్పారు. ఒక్కరాత్రికే చనిపొయిన పేషెంట్‌కు మూడు లక్షలు వసూలు చేస్తున్నారంటూ మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు కట్టి తీరాల్సిందేనని ఆస్పత్రి నిర్వాహకులు చెప్పడంతో ఆగ్రహం చెందిన మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. వైద్యం పేరుతో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా గొంతెత్తారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





Untitled Document
Advertisements