రూ.90 దాటేసిన పెట్రోల్...సామాన్యుల్లో గుబులు!!

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 03:47 PM

రూ.90 దాటేసిన పెట్రోల్...సామాన్యుల్లో గుబులు!!

వాహనదారులకు కొత్త ఏడాది ఆరంభంలోనే ఝలక్ తగిలింది. దేశంలో పెట్రోల్ ధరలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలకు చేరాయి. లీటరు పెట్రోల్ ధర ఇప్పటికే రూ.90 దాటేసింది. దీంతో వాహనదారుల్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. పెట్రోల్ ధర రూ.100 వెళ్తుందేమో అని సాధారణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పెట్రోల్ ధర పెరగడానికి గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు పెరుగుదల కారణమని చెప్పొ్చ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోవాలి. క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 80 డాలర్లు, 100 డాలర్ల వద్ద ఏమీ లేవు. ముడి చమురు ధర 50 డాలర్లకు అటుఇటుగా కదలాడుతోంది. 2018లో క్రూడ్ ధర బ్యారెల్‌కు 80 డాలర్ల వద్ద ఉంది. అప్పుడు పెట్రోల్ ధర లీటరుకు రూ.84 వద్ద ఉండేది.

అయితే ఇప్పుడు మోదీ ప్రభుత్వ హయంలో క్రూడ్ ధరలు 50 డాలర్ల వద్ద ఉన్నా కూడా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుకుంటూ వెళ్లిపోవడమే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పెట్రోల్, డీజిల్ రేటులో 60 శాతం పన్నులే ఉండటం గమనార్హం.

కేంద్ర ప్రభుత్వం 2019 ఆరంభంలో పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.19.98 నుంచి రూ.32.98 పెంచేసింది. అదేసమయంలో డీజిల్‌పై కూడా ఈ సుంకాన్ని రూ.15.83 నుంచి రూ.31.83 పెంచింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆదాయం పెరిగింది. కానీ సామాన్యులపై మాత్రం భారం పెరుగుతూనే వస్తోంది. కేంద్ర ప్రభుత్వంతోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుంకాలు పెంచుకోవడంతో ధరలు మరింత పైకి వెళ్లాయి.





Untitled Document
Advertisements