కరోనా టీకా వేయించుకున్న మహేష్ బాబు వదిన శిల్ప శిరోద్కర్

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 12:50 PM

కరోనా టీకా వేయించుకున్న మహేష్ బాబు వదిన శిల్ప శిరోద్కర్

గతేడాది (2020) నుంచి క్రమంగా ఉదృతమవుతూ దేశవిదేశాలకు వణికించింది కరోనా మహమ్మారి. కోట్లాది మంది జనం కరోనా బారినపడి విలవిల్లాడారు. ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో వైరస్‌ కల్లోలం సృష్టిస్తోంది. అయితే ఈ కరోనా వైరస్‌ను తరిమికొట్టడానికి వాక్సిన్స్ ఇస్తున్నారు. కొన్ని దేశాలు ఈ వ్యాక్సిన్ డ్రైవ్‌ను వివిధ దశల్లో నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో ఉంటున్న మహేష్ బాబు వదిన, నమ్రత శిరోద్కర్ సిస్టర్, బాలీవుడ్ నటి శిల్ప శిరోద్కర్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.

తాను కరోనా టీకా వేయించుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించిన శిల్ప శిరోద్కర్.. వ్యాక్సిన్ వేయించుకోవడం చాలా సురక్షితమని పేర్కొన్నారు. మనమంతా వ్యాక్సిన్ తీసుకొని మళ్ళీ సాధారణ జీవితానికి ఈజీగా వెళ్లొచ్చు, మళ్లీ మామూలు రోజులు రాబోతున్నాయని తెలుపుతూ తనకు టీకా వేసిన UAE ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నానని ఆమె అన్నారు. ఈ మేరకు మాస్క్‌ ధరించి, తాను టీకా వేయించుకున్న చేతిని చూపిస్తూ సెల్ఫీ పోస్ట్ చేశారు శిల్ప శిరోద్కర్. కాగా కరోనా టీకా వేయించుకున్న తొలి బాలీవుడ్ నటి శిల్పనే కావడం విశేషం.

శిల్ప శిరోద్కర్ వ్యాక్సిన్ తీసుకున్న పోస్ట్‌ని సోషల్ మీడియాలో చూసిన మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ అదే సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ తన సోదరిని 'గుడ్ గర్ల్' అని సింపుల్‌గా కామెంట్ చేశారు. 1990 -92 మధ్యకాలంలో బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసిన శిల్ప శిరోద్కర్ ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఆమె దుబాయ్‌లో ఉంటున్నారు. గతేడాది దీపావళి సందర్భంగా మహేష్ ఫ్యామిలీ దుబాయ్ వెళ్లి శిల్ప ఇంట్లో సందడి చేశారు. సితార, గౌతమ్, నమ్రతలతో కలిసి దుబాయ్ వీధులను చుట్టేశారు మహేష్.





Untitled Document
Advertisements