దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ఉత్పత్తి చేస్తున్న అన్ని రకాల వ్యక్తిగత, వాణిజ్య వాహనాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్, వేరియంట్ని బట్టి గరిష్ఠంగా 1.9శాతం మేర ధరలు పెరిగినట్లు వెల్లడించింది. వాహనాన్ని బట్టి రూ.4,500 నుంచి 40,000 వరకు పెరుగుదల ఉన్నట్లు పేర్కొంది. 2020 డిసెంబరు 1 నుంచి 2021, జనవరి 7 మధ్య బుక్ చేసుకున్న కొత్త థార్ కార్లకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. నేటి నుంచి జరిగే థార్ బుకింగ్లకు.. డెలివరీ నాటి ధరలు వర్తిస్తాయని తెలిపింది.