సిడ్నీ టెస్టులో అడ్డంగా దొరికిన స్మిత్... పంత్ పై కుట్ర

     Written by : smtv Desk | Mon, Jan 11, 2021, 05:44 PM

సిడ్నీ టెస్టులో అడ్డంగా దొరికిన స్మిత్... పంత్ పై కుట్ర

భారత్‌తో జరుగుతున్న సిడ్నీ టెస్టులో గెలిచేందుకు ఆస్ట్రేలియా చేయని ప్రయత్నం లేదు. 407 పరుగుల లక్ష్య ఛేదనలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (97: 118 బంతుల్లో 12x4, 3x6) దూకుడుగా ఆడటంతో కంగారుపడిన ఆస్ట్రేలియా తొలుత అతనిపై స్లెడ్జింగ్‌కి దిగింది. ఆ పాచిక పారకపోవడంతో అటాకింగ్ ఫీల్డింగ్‌ని సెట్ చేసి ఒత్తిడిలోకి నెట్టాలని ట్రై చేసింది. కానీ.. స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి మరీ పంత్ సిక్సర్లు బాదడంతో వెనక్కి తగ్గింది. ఇక ఫాస్ట్ బౌలర్లు పదే పదే షార్ట్ పిచ్ బంతులతో అతడ్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఆఖరికి క్రీడాస్ఫూర్తి తప్పి.. రిషబ్ పంత్ గార్క్ మార్క్‌ని చెరిపేసే సాహసం చేశారు. దాంతో.. ఇప్పుడు ఆ టీమ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వక్తమవుతున్నాయి.

సోమవారం తొలి సెషన్‌లో భారత్ స్కోరు 102 వద్ద కెప్టెన్ రహానె (4) ఔటవగానే క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు. వాస్తవానికి శనివారం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. రిషబ్ పంత్ మోచేతికి గాయమైంది. దాంతో.. స్కానింగ్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో.. పంత్ బ్యాటింగ్‌కి రావడంపై సందిగ్ధత నెలకొనగా.. ఈరోజు సాహసోపేతంగా అదీ బ్యాటింగ్ ఆర్డర్‌లో పంత్ ముందు వచ్చాడు. గాయం వేధిస్తున్నా.. క్రీజులో కుదుకునే వరకూ సహనంతో ఆడిన పంత్.. ఆ తర్వాత బ్యాట్ ఝళిపించేశాడు. అతడ్ని నిలువరించేందుకు ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనీ పదే పదే బౌలర్లని, వ్యూహాల్ని మార్చినా ప్రయోజనం లేకపోయింది. పుజారాతో కలిసి పంత్ నాలుగో వికెట్‌కి 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

ఈరోజు లంచ్ బ్రేక్ తర్వాత రిషబ్ పంత్, చతేశ్వర్ పుజారా కంటే కొన్ని నిమిషాలు ముందు మైదానంలోకి ఆస్ట్రేలియా టీమ్ వచ్చింది. ఈ క్రమంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేసేందుకు వికెట్ల సమీపానికి వచ్చిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్.. అనంతరం క్రీజులోకి వచ్చి రిషబ్ పంత్ గీసుకున్న గార్డ్ మార్క్‌ని కాళ్లతో చెరిపేశాడు. స్మిత్ అటు ఇటూ చూసి గార్డ్ మార్క్‌ చెరిపేయడం స్టంప్ మైక్‌లో స్పష్టంగా రికార్డైంది. స్మిత్ అలా మార్క్ చెరిపేసిన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్.. తన గార్డ్ మార్క్ కనబడకపోవడంతో మళ్లీ ఫీల్డ్ అంపైర్ సాయం తీసుకుని గీసుకోవాల్సి వచ్చింది. స్మిత్ క్రీడాస్ఫూర్తి తప్పాడంటూ మాజీ క్రికెటర్లు, అభిమానులు విమర్శిస్తున్నారు. 2018లో బాల్ టాంపరింగ్‌కి సహకరించిన స్మిత్‌పై ఏడాది నిషేధం పడిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements