టీమండియాపై హర్షాభోగ్లే ప్రశంసలు

     Written by : smtv Desk | Mon, Jan 11, 2021, 05:50 PM

టీమండియాపై హర్షాభోగ్లే ప్రశంసలు

ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా సోమవారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 407 పరుగుల ఛేదనలో టీమిండియా 250/4తో నిలిచిన దశలో క్రీజులోకి వచ్చిన హనుమ విహారి (23 నాటౌట్: 161 బంతుల్లో 4x4) చివరి వరకూ సహనంతో బ్యాటింగ్ చేశాడు. మధ్యలో తొడ కండరాల గాయం వేధించినా, ఆస్ట్రేలియా ఫీల్డర్లు పదే పదే స్లెడ్జింగ్‌కి దిగినా ఏకాగ్రత చెదరనివ్వలేదు. దాంతో.. ఒకానొక దశలో చేజారిపోయినట్లు కనిపించిన మ్యాచ్‌ని డ్రాతో భారత్‌ ముగించగలిగింది. అశ్విన్‌ (39 నాటౌట్: 128 బంతుల్లో 7x4)తో కలిసి దాదాపు మూడు గంటలకిపైగా క్రీజులో నిలిచిన హనుమ విహారి గొప్ప పోరాట పటిమని కనబర్చాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 38 బంతులాడిన హనుమ విహారి.. లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ 4 పరుగుల వద్దే రనౌటయ్యాడు. దాంతో.. అతనిపై పతాక స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈరోజు రెండో ఇన్నింగ్స్‌లోనూ అతని డిఫెన్స్‌పై కొంత మంది నెటిజన్లు పెదవి విరిచారు. కానీ.. కామెంటేటర్ మాటల్లో చెప్పాలంటే.. 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కష్టం. అదీ 272 పరుగులకే ఐదు టాప్ ఆర్డర్‌ వికెట్లు చేజారిన తర్వాత.. డ్రా కోసం ప్రయత్నించడం మేలు. అదే హనుమ విహారి చేస్తున్నాడు అని చెప్పుకొచ్చారు. ఒకవేళ హనుమ విహారి కాస్త దూకుడుగా ఆడి ఔటై ఉండింటే..? ఆ తర్వాత మిగిలిన నాలుగు వికెట్లని తీయడం ఆస్ట్రేలియా బౌలర్లకి పెద్ద కష్టం కాకపోవచ్చు. మరీ ముఖ్యంగా.. జడేజా బొటనవేలికి గాయం కావడంతో అతను మునుపటి తరహాలో ఆడలేకపోవచ్చు. ఇక బుమ్రా, సిరాజ్, సైనీ గురించి అందరికీ తెలిసిందే.

హనుమ విహారి పట్టుదల, ఏకాగ్రతకి కామెంటేటర్ హర్షాభోగ్లే ఫిదా అయిపోయాడు. ఎంతలా అంటే..? ‘‘ విజయలక్ష్మీ గారు మీ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు’’అని విహారి తల్లిని ఉద్దేశించి ట్వీట్ చేశాడు (విహారి స్వస్థలం కాకినాడ). మ్యాచ్ జరుగుతున్న సమయంలో హనుమ విహారి డిఫెన్స్‌పై ఓ నెటిజన్ నెగటివ్‌గా కామెంట్ చేశాడు. దాంతో.. అతనికీ హర్భాభోగ్లే సమాధానమిచ్చాడు. విహారి తొడ కండరాలకి గాయమైన విషయాన్ని గుర్తుచేసి.. టీమిండియా కోసం ధైర్యంగా మ్యాచ్ ఆడుతున్నాడంటూ కొనియాడాడు.





Untitled Document
Advertisements