కరోనా పుట్టుక...ఎట్టకేలకు దిగివచ్చిన చైనా

     Written by : smtv Desk | Mon, Jan 11, 2021, 06:12 PM

కరోనా పుట్టుక...ఎట్టకేలకు దిగివచ్చిన చైనా

కరోనా వైరస్ మహమ్మారి పుట్టుకపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిపుణుల బృందం స్వతంత్ర దర్యాప్తునకు ఇన్నాళ్లూ మోకాలడ్డిన చైనా.. ఎట్టకేలకు అంగీకరించింది. డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందం గురువారం (జనవరి 14న) తమ దేశంలో పర్యటించనుందని చైనా ప్రకటించింది. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తన ప్రకటనలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కానీ, పూర్తి వివరాలను వెల్లడించలేదు. కరోనా వైరస్‌కు మూలకేంద్రమైన వుహాన్‌ నగరంలో నిపుణుల బృందం పర్యటిస్తుందా? లేదా? అనే విషయం మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

వుహాన్‌లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌లో తొలుత ఈ వైరస్ బయటపడిందని వెల్లడించిన చైనా.. మిగతా దేశాలకు మహమ్మారి పాకడంతో రెండు నెలలు తిరక్కముందే మాట మార్చింది. కరోనా వైరస్ విషయంలో తొలి నుంచి గోప్యత పాటించి, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కోవిడ్-19 మూలాలపై దర్యాప్తు జరపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థపై సభ్య దేశాలు ఒత్తిడి తీసుకొచ్చాయి. దీంతో స్వతంత్ర దర్యాప్తు బృందం సాయంతో మూలాలను కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించింది.

వైరస్‌ గురించి చైనా మొదట నుంచి సరైన సమాచారం ఇవ్వలేదని ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. వ్యాప్తి ప్రారంభమైన వెంటనే సమాచారం ఇచ్చి ఉంటే పరిస్థితి ఈ స్థాయికి దిగజారేది కాదని ఆరోపిస్తున్నాయి. అలాగే వైరస్ మూలాలపై జరిపే పరిశోధనలను కమ్యూనిస్ట్‌ దేశం కఠినంగా నియంత్రించిందని పలు మీడియా సంస్థల కథనాలు వివరించాయి.

కరోనా పుట్టుకపై దర్యాప్తునకు చైనా సహకరించడంలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ ఘ్యాబ్రియోసిస్ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ నిపుణుల బృందానికి చైనా అనుమతి నిరాకరించడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని టెడ్రోస్ వ్యాఖ్యానించారు. చైనాలో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటనకు ఆ దేశ అధికారుల ఇంకా అనుమతి ఖరారు చేయలేదని తెలిసిందన్నారు.

ఈ విషయం గురించి చైనా ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపానని, డబ్ల్యూహెచ్ఓ మిషన్ ప్రాధాన్యత గురించి మరోసారి స్పష్టం చేశానని పేర్కొన్నారు. వైరస్ పుట్టుకపై నిగ్గు తేల్చేందుకు జనవరి తొలినాళ్లలో 10 మందితో కూడిన నిపుణుల బృందం చైనాలో పర్యటించాలని నిర్ణయించింది.





Untitled Document
Advertisements