రోహిత్ పైకి త్రో విసిరిన పృథ్వీ షా... సీరియస్

     Written by : smtv Desk | Sat, Jan 16, 2021, 08:35 AM

రోహిత్  పైకి త్రో విసిరిన పృథ్వీ షా... సీరియస్

భారత్, ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఓ కామెడీ సన్నివేశం చోటు చేసుకుంది. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో బంతిని స్వ్కేర్ లెగ్ దిశగా ఫుష్ చేసిన మార్కస్ లబుషేన్ (108: 204 బంతుల్లో 9x4) సింగిల్ కోసం పరుగెత్తాడు. దాంతో.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ పృథ్వీ షా బంతిని అందుకుని.. రనౌట్ కోసం వేగంగా బంతిని త్రో చేశాడు. కానీ.. అతని త్రో గురి తప్పి నేరుగా వెళ్లి రోహిత్ శర్మని తాకింది. దాంతో.. మ్యాచ్ కామెంటేటర్లు పకపకా నవ్వేశారు. రోహిత్ శర్మ మాత్రం చాలా సీరియస్‌గా కనిపించాడు. పృథ్వీ షా త్రోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు పేలుతున్నాయి.


వాస్తవానికి అక్కడ పృథ్వీ షా తప్పిదం ఏమీ పెద్దగా కనిపించలేదు. అతను బంతిని అందుకునే సమయానికి లబుషేన్ క్రీజు మధ్యలోనే ఉండటంతో.. రనౌట్ కోసం వేగంగా నాన్‌స్ట్రైక్ ఎండ్‌ వికెట్లపైకి విసరాలని ట్రై చేశాడు. అప్పటికే బౌలర్ వాషింగ్టన్ సుందర్ కూడా రియాక్ట్ అవుతూ వికెట్ల సమీపానికి బంతి కోసం వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ.. పృథ్వీ షా, వికెట్ల మధ్య నేరుగా సిల్లీ మిడాన్‌లో రోహిత్ శర్మ.. అదీ అడ్డుగా నిలబడిపోయాడు. దాంతో.. బంతి నేరుగా వెళ్లి అతని శరీరాన్ని తాకేలా కనిపించగా.. ఆఖరి క్షణలో రోహిత్ శర్మ చేతుల్ని అడ్డుగా పెట్టాడు. దాంతో.. హిట్‌మ్యాన్ చేతి వేలికి చిన్న గాయమైంది.


బంతి తనని తాకిన తర్వాత రోహిత్ శర్మ చాలా సీరియస్‌గా కనిపించాడు. కనీసం పృథ్వీ షా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఒకసారి వేలి గాయాన్ని చూసుకుని.. కీపర్ రిషబ్ పంత్‌వైపు సీరియస్‌గా చూస్తూ.. బంతిని అందుకుని అతనికి త్రో చేశాడు. దాంతో.. పృథ్వీ షాకి సారీ చెప్పే అవకాశం కూడా లేకపోయింది. తొలుత ఆ త్రో కాస్త కామెడీగా అనిపించినా.. వేలికి గాయం కావడం, రోహిత్ శర్మ కోపంగా కనిపించడంతో సీరియస్‌గా మారిపోయింది.





Untitled Document
Advertisements