ఎడాపెడా అప్పులు చేసిన వెనిజులా ... ఇప్పుడు ఏమైందంటే

     Written by : smtv Desk | Tue, Mar 09, 2021, 08:37 AM

ప్రస్తుతం తీవ్ర దుర్భిక్షంతో కొట్టుమిట్టాడుతున్న దక్షిణ అమెరికా దేశం వెనిజులా ఒకప్పుడు భోగభాగ్యాలతో తులతూగింది. చమురు, బంగారం నిక్షేపాలతో సంపన్నదేశంగా విరాజిల్లింది. కానీ అదంతా 90వ దశకానికి ముందుమాట. హ్యూగో చావెజ్ అధికారం చేపట్టాక తీసుకున్న కొన్ని నిర్ణయాలు వెనిజులాను పతనం దిశగా నడిపించింది. చమురు నిల్వలు ఉన్నాయన్న ధీమాతో ఎడాపెడా అప్పులు చేసి దుర్భర దారిద్ర్యం కోరల్లో చిక్కుకుంది. దాంతో ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.

నష్టనివారణ కోసమంటూ ఇష్టం వచ్చినట్టు కరెన్సీ నోట్లు ముద్రించారు. సమస్య పరిష్కారం కాలేదు సరికదా ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటింది. అదే సమయంలో కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. కూరగాయలు కొనేందుకు కూడా సంచుల కొద్దీ డబ్బు తీసుకెళ్లాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో వెనిజులా సర్కారు ఏకంగా 10 లక్షల బొలివర్ల విలువతో కరెన్సీ నోట్లు ముద్రించాలని నిర్ణయించింది. వెనిజులా కరెన్సీని బొలివర్ అంటారు.

చమురు ధరలు ఎక్కువగా ఉన్న సమయంలో ధనిక దేశంగా ఉన్న వెనిజులా ప్రజలకు అన్నీ ఉచితంగా అందించేంది. అందుకోసం విదేశాల నుంచి భారీగా రుణాలు తీసుకుని విచక్షణ లేకుండా ఖర్చు చేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడంతో వెనిజులాకు కష్టాలు మొదలయ్యాయి. అప్పుల భారం పెరిగిపోయింది. హ్యూగో చావెజ్ అనంతరం వచ్చిన నికొలాస్ మదురో ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. ఇప్పుడు 10 లక్షల విలువైన బొలివర్ నోటు విడుదల చేసినా పరిస్థితి మారుతుందన్న నమ్మకం లేదు.

ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే... వెనిజులా తీసుకువస్తున్న 1 మిలియన్ బొలివర్ నోటు విలువ భారత కరెన్సీలో 39 రూపాయలే!. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు ఈ చిన్నదేశం ఎంత పెద్ద కష్టంలో పడిందో! ఒకప్పుడు ఆఫ్రికా దేశం జింబాబ్వే కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంది. తర్వాత కాలంలో కాస్త కోలుకున్నట్టు కనిపించినా కరోనా దెబ్బకు మళ్లీ చతికిలపడింది. మరి వెనిజులా ఏంచేస్తుందో చూడాలి!





Untitled Document
Advertisements