షర్మిల బహిరంగ సభకు ముఖ్య అతిథిగా తల్లి విజయమ్మ!

     Written by : smtv Desk | Wed, Apr 07, 2021, 03:08 PM

షర్మిల బహిరంగ సభకు ముఖ్య అతిథిగా తల్లి విజయమ్మ!

తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని చూస్తున్న వైఎస్ షర్మిల ఖమ్మం వేదికగా జరిగే సభలో దానికి సంబంధించిన వివరాలు ప్రకటించే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9న ఖమ్మంలో పెద్ద ఎత్తున ఈ సభ నిర్వహించాలని నిర్ణయించారు. కొవిడ్ కేసుల పెరుగుదలతో ఆ ప్రభావం ఈ బహిరంగ సభపై పడింది. పోలీసులు ఆంక్షలు విధించడంతో సాధారణంగానే ఖమ్మం సభ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, వైఎస్ షర్మిల.. ఈ సభకు ముఖ్యమైన అతిథిని ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.

షర్మిల బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఆమె తల్లి విజయమ్మ హాజరుకానున్నారని సమాచారం. తల్లిని పక్కన పెట్టుకుని పార్టీ ప్రకటన చేయాలని షర్మిల భావిస్తున్నారని తెలుస్తోంది. తన పార్టీకి తన తల్లి విజయమ్మ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణతో పాటు ఏపీ నుంచి కూడా భారీగా వైఎస్ అభిమానులు, షర్మిల అభిమానులు వచ్చే అవకాశముందని ఆమె మద్దతుదారులు చెప్తున్నారు. సభా వేదికపై 100 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు తెలంగాణలోని వైఎస్ఆర్ అభిమానులు, గతంలో కాంగ్రెస్‌లో పని చేసిన నేతలకు స్వయంగా విజయమ్మ ఫోన్ చేసి షర్మిల వెంట నడవాలని కోరినట్టు వార్తలు సైతం వచ్చాయి. షర్మిల సభకు విజయమ్మ హాజరుకానున్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె పెట్టే కొత్త పార్టీలోనూ తల్లి కీలకంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదని ఊహాగానాలు వస్తున్నాయి.





Untitled Document
Advertisements