పది రాష్ట్రాల్లో కరోనా వైరస్ డబుల్ మ్యుటేషన్

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 02:57 PM

పది రాష్ట్రాల్లో కరోనా వైరస్ డబుల్ మ్యుటేషన్

దేశంలో కరోనా రెండో దశ విజృంభణ అసాధారణంగా ఉంది. గత పది రోజుల నుంచి నిత్యం లక్షకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో వైరస్‌ ఉద్ధృతికి ‘డబుల్‌ మ్యుటేషన్‌’ కారణమని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికార వర్గాలు పేర్కొన్నాయి. దేశంలోని 10 రాష్ట్రాల్లో కోవిడ్ డబుల్ మ్యుటేషన్ చెందినట్టు తెలిపాయి. ఆ రాష్ట్రాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి డబుల్ మ్యుటేషన్ కారణమని వివరించాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ్ బెంగాల్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని కోవిడ్ బాధితుల్లో డబుల్ మ్యుటేషన్ గుర్తించారు.

ఏదిఏమైనప్పటికీ దేశంలో పట్టపగ్గాల్లేకుండా మహమ్మారి వ్యాప్తిచెందడానికి డబుల్ మ్యుటేషన్ 100 శాతం కారణం కాదని వ్యాఖ్యానించాయి. ముట్యేషన్ చెందిన రెండు స్ట్రెయిన్‌లు కలిసి మూడో స్ట్రెయిన్‌గా మారడమే డబుల్ మ్యుటేషన్. భారత్‌లో E484Q, L452R వైరస్ జాతులు డబుల్ మ్యుటేషన్ చెందాయి. L452R రకం అమెరికాలోని కాలిఫోర్నియాలో గుర్తించగా.. E484Q రకం దేశీయంగా ఉన్న స్ట్రెయిన్.

దేశంలో కోవిడ్ వ్యాప్తి తీరును అంచనా వేసేందుకు పాజిటివ్‌‌గా నిర్ధారణ రోగుల నమూనాలను కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపడుతున్నారు. దాదాపు 1,40,000 నమూనాలకు జీనోమ్ సీక్వెన్స్ నిర్వహించిన తర్వాత డబుల్ మ్యుటేషన్ జరిగినట్టు గుర్తించారు. కరోనా సంబంధిత మరణాలు, వైరస్ తీవ్రత, పాక్షిక ప్రభావం, రీ-ఇన్‌ఫెక్షన్, వ్యాక్సిన్ సమర్ధత తదితర అంశాలలో డబుల్ మ్యుటేషన్ పాత్రను విశ్లేషించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.


ఢిల్లీ కోవిడ్ కేసుల్లో యూకే స్ట్రెయిన్ మిళతమైనట్టు పేర్కొన్నాయి. పంజాబ్‌లోని కోవిడ్ కేసుల్లో 80 శాతం మందిలో బ్రిటన్ స్ట్రెయిన్, మహారాష్ట్రలో 61శాతం శాంపిళ్లలో డబుల్‌ మ్యుటేషన్‌ బయటపడినట్లు నిపుణులు వెల్లడించారు. జీనోమ్ సీక్వెన్స్‌లో భాగంగా మహారాష్ట్రలో జనవరి-మార్చి మధ్య కాలంలో 361 కరోనా శాంపిళ్లను పుణెలోని నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో విశ్లేషించారు. వాటిలో 61శాతం కేసుల్లో డబుల్‌ మ్యుటేషన్లు బయటపడినట్లు నిపుణులు గుర్తించారు.

దేశవ్యాప్తంగా 18-19 రాష్ట్రాలు లేదా 70 నుచి 80 జిల్లాల్లో యూకే స్ట్రెయిన్ కేసులు ఉన్నట్టు తెలిపారు. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లు కొద్ది జిల్లాల్లో స్వల్పంగా ఉన్నాయి. డబుల్ మ్యుటేషన్ గుర్తించిన రాష్ట్రాలకు ఈ సమాచారాన్ని అందజేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. దీని ఆధారంగా రాష్ట్ర కోవిడ్ నిఘా, పర్యవేక్షణ అధికారులు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణను నిర్ణయిస్తాయి.

కొత్తరకం, డబుల్ మ్యుటేషన్ స్ట్రెయిన్‌లు దేశంలో గుర్తించినట్టు గత నెలలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక, దేశంలో కోవిడ్ మరో మైలురాయిని గురువారం అధిగమించింది.

రోజువారీ పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో రెండు లక్షలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో నిత్యం 2లక్షల కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరుపుతుండగా.. వాటిలో స్వల్ప సంఖ్యలోనే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టారు. వైరస్‌ రకం ఎంత ప్రభావవంతమైనదో తెలిస్తే ప్రజలను కూడా అప్రమత్తం చేసే వీలుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.





Untitled Document
Advertisements