మరో అరుదైన ఘనతను ఖాతాలో వేసుకన్న సోనూసూద్

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 05:48 PM

మరో అరుదైన ఘనతను ఖాతాలో వేసుకన్న సోనూసూద్

లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వేలాది మంది వలస కార్మికులు, నిరుపేదల పాలిక ఆపద్భాందవుడిగా నిలిచాడు నటుడు సోనూసూద్. లాక్‌డౌన్‌లో తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు విఫలయత్నాలు చేస్తున్న వారిని తన సొంత డబ్బులతో రవాణ సౌకర్యం ఏర్పాటు చేసి.. ఎందరినో తమ ఇళ్లకు చేర్చాడు. అంతటితో సోనూసూద్ దాతృత్వం ఆగలేదు. కోట్లాది రూపాయిలు వెచ్చిస్తూ.. ఎందరికో ఉపాధి కల్పించాడు అతను. దీంతో సహాయం అందుకున్న వారి దృష్టిలోనే కాదు.. యావత్ భారతదేశం దృష్టిలో అతను ఓ సూపర్ హీరోగా నిలిచాడు.

కాగా, సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో అతను ఇప్పటికీ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. కష్టం ఉంది అంటూ సోషల్‌మీడియాలో ఎవరైనా మెసేజ్ పెడితే చాలు.. వెంటనే స్పందించి వారికి తగిన సహాయాన్ని అందిస్తున్నాడు. అతను చేస్తున్న సేవా కార్యక్రమాలను మెచ్చుకుంటూ.. ఇప్పటికే పలు సంస్థలు అతనికి సన్మానాలు చేశాయి. పలు రికార్డులను కూడా అతను అందుకున్నాడు. తాజాగా సోనూ సూద్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకన్నాడు.

సోనూసూద్ సేవానిరతిని చూసిన తర్వాత.. అతనికి ఫ్యాన్ ఎక్కువైపోయారు. సోషల్‌మీడియాలోనూ అతన్ని ఫాలో అయ్యేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ క్రమంలో ట్విట్టర్‌లో సోనూ ఫాలోవర్ల సంఖ్య ఆరు మిలియన్లు దాటింది. ఈ సందర్భంగా అతనికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు. సోనూసూద్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు. బుధవారం సైకిల్‌పై ఈ సినిమా షూటింగ్‌కి వెళ్లి.. అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు అతను. ఈ సినిమాతో పాటు చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘పృథ్వీ రాజ్’లో అతను నటిస్తున్నాడు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.





Untitled Document
Advertisements