వరంగల్ : ఎంజీఎం ఆస్పత్రిలో 20 మంది డాక్టర్లకు కరోనా

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 05:53 PM

వరంగల్ : ఎంజీఎం ఆస్పత్రిలో 20 మంది డాక్టర్లకు కరోనా

దేశవ్యాప్తంగా రెండోసారి దడ పుట్టిస్తున్న కరోనా వైరస్ తెలంగాణలోనూ విపరీతమైన ప్రభావం చూపుతోంది. వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. గురువారం రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 వేల కేసులకు పైగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, వారం రోజులుగా సగటున రోజుకు 40కి పైగా కేసులు నమోదవుతున్నాయి. వీరంతా ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఎంజీఎం ఆస్పత్రిలో 20 మంది హౌస్ సర్జన్ డాక్టర్‎లకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఇప్పటికే వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చందూలాల్ కరోనా కారణంగా చనిపోయిన సంగతి తెలిసిందే.

మరోవైపు, తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 3,840 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,21,880 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 3,840 మందికి పాజిటివ్‌ తేలినట్లు తెలిపింది. తెలంగాణలో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఇవే అత్యధిక కేసులు కావడం గమనార్హం. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 505 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

1,198 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా.. 9 మంది బలి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 30,494కి చేరుకోగా.. 20,215 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.


మేడ్చల్ మల్కాజిగిరిలో 407, రంగారెడ్డి జిల్లాలో 302, నిజామాబాద్‌‌లో 303, సంగారెడ్డిలో 175, జగిత్యాలలో 167, కామారెడ్డిలో 144, కరీంనగర్‌లో 124, ఖమ్మంలో 111, మహబూబ్‌నగర్ జిల్లాలో 124, మంచిర్యాలలో 101, నల్లగొండ జిల్లా లో 116, నిర్మల్ జిల్లాలో 159, వరంగల్ అర్బన్ జిల్లా లో 114 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో బెడ్ల కొరత మొదలైంది. సినిమా థియేటర్ల మాదిరి ప్రైవేట్ ఆస్పత్రుల్లో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తుండడం గమనార్హం.





Untitled Document
Advertisements