ఎందరికో అపద్భాందవుడిగా నిలిచిన సోనూసూద్‌కి కరోనా!

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 03:43 PM

ఎందరికో అపద్భాందవుడిగా నిలిచిన సోనూసూద్‌కి కరోనా!

కరోనా లాక్‌డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి.. తమ స్వస్థలాలకు వెళ్లలేక.. ఇబ్బందులు ఎదురుకున్న లక్షలాది మంది వలస కార్మికులకు, నిరుపేదలకు అండగా నిలిచాడు నటుడు సోనూసూద్. తన సొంత ఖర్చుతో రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి ఎందరితో తమ స్వగ్రామాలకు చేర్చారు. కోట్లాది రూపాయిలు వెచ్చించి కష్టాల్లో ఉన్నవారికి తగిన సహాయాన్ని అందించాడు. కష్టమని కోరితే చాలు.. వెంటనే స్పందించి అక్కడ వాలిపోయాడు అతను.

ఈ సందర్భంగా సోనూ ఎందరికో దేవుడిగా నిలిచాడు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అతనికి పూజలు కూడా నిర్వహించారు. ఒక కరోనా లాక్‌‌డౌన్ ముగిసిన తర్వాత కూడా సోనూ తన సహాయ కార్యక్రమాలకు బ్రేక్ వేయలేదు. సోషల్‌మీడియలో ఆయన సహాయం కోరి ఎవరు వచ్చినా.. వెంటనే వారిని ఆదుకుంటున్నాడు. సోనూసూద్ ఫౌండేషన్‌ పేరుతో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఎందరికో అపద్భాందవుడిగా నిలిచాడు సోనూసూద్.

కొద్ది రోజుల క్రితం ‘సంజీవని’ పేరుతో దేశంలోనే అతి పెద్ద కరోనా వ్యాక్సిన్ డ్రైవ్‌ని అమృత్‌సర్‌లో సోనూసూద్ ప్రారంభించాడు. ఈ డ్రైవ్‌లో ముందుగా అతను వ్యాక్సిన్ తీసుకున్నాడు. ప్రతీ ఒక్కరు భయపడకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని అతను పిలుపునిచ్చాడు. అయితే కరోనా మాత్రం సోనూని వదలలేదు. తాజాగా అతనికి పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు.

‘‘నాకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. వెంటనే తగిన జాగ్రత్తలతో నేను సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాను. కానీ, దిగులు పడకండి.. మీ అందరికీ సహాయం చేసేందుకు ఇది నాకు దొరికిన మంచి సమయం. గుర్తుంచుకోండి, మీ అందరికీ నేనున్నాను’’ అంటూ సోనూసూద్ ట్వీట్ ద్వారా వెల్లడించాడు. ఈ ట్వీట్ చూసిన అతని అభిమానులు, నెటిజన్లు సోనూ వైరస్ నుంచి త్వరగా కోలుకోవాలని.. ప్రార్థిస్తూ కామెంట్ చేస్తున్నారు.





Untitled Document
Advertisements