థియేటర్స్ ఓపెన్ అయ్యాకే సినిమా విడుదల

     Written by : smtv Desk | Wed, Jun 16, 2021, 05:39 PM

థియేటర్స్ ఓపెన్ అయ్యాకే సినిమా విడుదల

కరోనా దెబ్బకు మరోసారి అన్ని రంగాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీపై ఈ ప్రభావం మరీ ఎక్కువగా పడింది. గతేడాది కరోనా కారణంగా సినిమా షూటింగ్స్, థియేటర్స్ మూతపడగా.. సెకండ్ వేవ్ లోనూ అదే పరిస్థితి కనిపించింది. దీంతో పలు సినిమాల విడుదల ఆగిపోయింది. అందులో ఒకటి సాయి పల్లవి- నాగ చైతన్య 'లవ్ స్టోరీ'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరిగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 16న థియేటర్స్‌లో రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా దెబ్బకు వాయిదా పడింది.
అయితే ప్రస్తుతం కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటం, మళ్ళీ సాధారణ పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో ఈ నెల చివరి నుంచి తెలుగు రాష్ట్రాల్లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ కానున్నాయని తెలుస్తుండటంతో అందరి దృష్టి ఈ 'లవ్ స్టోరీ'పై పడింది. థియేటర్స్ ఓపెన్ అయిన వెంటనే ఈ సినిమాను రిలీజ్ చేస్తారా లేక మరికొన్ని రోజులు ఆగుతారా? అనే అనుమానాలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన సునీల్ నారంగ్ చిన్న క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని తెలిపారు. థియేటర్లలో రోజుకు 3 ఆటలే నడిస్తే సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో లేమని, పూర్తి స్థాయిలో థియేటర్స్ ఓపెన్ అయ్యాకే విడుదల చేస్తామని అన్నారు. ఆ పరిస్థితి రావడానికి జూలై రెండో వారం రావొచ్చని ఆయన తెలిపారు. ఈ మేరకు త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పారు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీ నుంచి విడుదలైన 'సారంగ దరియా' లిరికల్ సాంగ్ పలు రికార్డులు తిరగరాసింది. దీంతో లవ్ స్టోరీపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.





Untitled Document
Advertisements