వాహన ధరలను పెంచనున్న ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ!

     Written by : smtv Desk | Mon, Jan 03, 2022, 02:15 PM

వాహన ధరలను పెంచనున్న ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ!

మీరు బైక్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ బజాజ్ ఆటో తన వాహన ధరలను పెంచబోతున్నట్లు తెలుస్తోంది. ఇది కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి.
నివేదికల ప్రకారం చూస్తే.. బజాజ్ ఆటో వచ్చే రెండు రోజుల్లో టూవీలర్ ధరలు పెంచబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశీ దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్ తన టూవీలర్ రేట్స్ పెంచడానికి రెడీగా ఉంది. రేపటి నుంచి అంటే జనవరి 4 నుంచి హీరో టూవీలర్ ధరలు పెరగబోతున్నాయి. ధర రూ.2 వేలు పైకి చేరనుంది.
ఈ క్రమంలో ఇప్పుడు బజాజ్ ఆటో కూడా ధరల పెంపు బాటలో పయనిస్తోంది. దీంతో కొత్తగా బైక్ లేదా స్కూటర్ కొనే వారిపై ప్రభావం పడనుంది. ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోవడం వల్ల ధరలు పెంచాల్సి వస్తోందని కంపెనీలు పేర్కొంటున్నాయి. దీంతో కొనే వారి జేబుకు చిల్లులు పడనున్నాయి.
ధరల పెంపు వార్తల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో షేరు ధర రూ.26 మేర పైకి కదిలింది. దీంతో షేరు ధర రూ.3277కు ఎగసింది. కాగా బజాజ్ ఆటో వాహన అమ్మకాలు గత నెలలో తగ్గాయి. 2021 డిసెంబర్ నెలలో కంపెనీ అమ్మకాలు 3,62,470 యూనిట్లుగా ఉన్నాయి. 2020 డిసెంబర్‌లో బజాజ్ ఆటో అమ్మకాలు 3,72,532 యూనిట్లుగా నమోదయ్యాయి.
ఇకపోతే వాహన తయారీ కంపెనీలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. గత ఏడాది చాల కంపెనీలు వాహన ధరలను పెంచేశాయి. అంతేకాకుండా ఇప్పుడు మరోసారి వాహన రేట్లను పెంచేందుకు రెడీ అవుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోవడం ఇందుకు ప్రధాన కారణం.





Untitled Document
Advertisements