టికెట్ రేట్ల పిటిషన్ విచారణ వచ్చే నెల 10కి వాయిదా !

     Written by : smtv Desk | Tue, Jan 04, 2022, 08:59 AM

టికెట్ రేట్ల పిటిషన్ విచారణ వచ్చే నెల 10కి వాయిదా !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ ధరల అంశంపై సమగ్రంగా పరిశీలన జరపాలని ఇటీవల ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే దానికి సంబంధించి సినీ పరిశ్రమతో త్వరలోనే కమిటీ భేటీ కానుంది. ఇదే విషయాన్ని ప్రభుత్వం ఈరోజు సోమవారం కోర్టుకు తెలిపింది. అంతేకాదు ఈ సమావేశం ఉన్న కారణంగా విచారణ వాయిదా వేయాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ రేట్ల పిటిషన్ విచారణను వచ్చే నెల 10కి వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉండగా పేదలకు సినీ వినోదం అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో టికెట్స్ నియంత్రించినట్లు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు జగన్ సర్కారు నిర్ణయం సరైంది కాదని సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా టికెట్ రేట్ల అంశాన్ని పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం గత నెల 27న ఓ కమిటీని ప్రతిపాదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కమిటీలో మొత్తం 13 మంది సభ్యులు ఉండగా.. అందులో అధికారులతో పాటుగా చలనచిత్ర పరిశ్రమ వ్యక్తులను భాగం చేసారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్ గా వ్యవహరించే ఈ కమిటీలో న్యాయశాఖ కార్యదర్శి - కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు పురపాలక శాఖ - ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు - సమాచార పౌర సంబంధాల కమీషనర్ సభ్యులుగా ఉన్నారు.
అలానే ఎగ్జిబిటర్ వేమూరి బాలరత్నం - డిస్ట్రిబ్యూటర్ తుమ్మల సీతారాం ప్రసాద్ - సినీ గోయర్స్ అసోసియేషన్ తరఫున సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ సిబిఎఫ్సి సెన్సార్ బోర్డ్ సభ్యుడు వడ్డి ఓం ప్రకాశ్ నారాయణ - తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు ముత్యాల రాందాస్ - డాక్టర్ జూపల్లి రాకేశ్ రెడ్డి - గంప లక్ష్మీ ప్రభుత్వం నియమించిన కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు.






Untitled Document
Advertisements