టొరంటో, జనవరి 6: రెండు విమానాలు ఢీకొని మంటలు వ్యాపించాయి. ఈ ఘటన కెనడాలోని టొరంటో విమానాశ్రయంలో జరిగింది. హుటాహుటిన విమాన సిబ్బంది ప్రయాణికులను అత్యవసర ద్వారం నుండి సురక్షితంగా తరలించారు. శుక్రవారం రాత్రి మెక్సికో నుంచి 168 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెస్ట్జెట్ సంస్థకు చెందిన విమానం టొరంటో విమానాశ్రయానికి చేరుకుంది.
విమానం గేట్ దగ్గరికి వెళ్లేందుకు వేచి ఉండగా సన్వింగ్ సంస్థకు చెందిన విమానం గేట్ నుంచి వెనుకకు వస్తూ వెస్ట్జెట్ విమానాన్ని ఢీకొట్టింది. వెంటనే వెస్ట్జెట్లో ఉన్న ప్రయాణికులను అత్యవసర గేట్ నుంచి కిందకు దింపేశారు. అందరూ సురక్షితంగా బయటకు వచ్చారని వెస్ట్జెట్ అధికార ప్రతినిధి లారెన్ స్టీవార్ట్ వెల్లడించారు. దీనికి సంబంధించి వీడియోలు, ఫొటోలను కొందరు ప్రయాణికులు సోషల్మీడియాలో షేర్ చేశారు.