గుంటూరు వినియోగదారుడికి ఉచితంగా ఇవ్వాల్సిన క్యారీ బ్యాగుకు నగదు వసూలు చేసిన గుంటూరులోని వస్త్ర దుకాణానికి జిల్లా వినియోగదారుల ఫోరం భారీగా జరిమానా విధించింది.
కేసు వివరాలు.. స్థానిక శ్రీనగర్ మెయిన్రోడ్కు చెందిన న్యాయవాది పోతుగుంట్ల సాయి సూర్యతేజ 2019, మే 5న లక్ష్మీపురం మెయిన్ రోడ్డులోని వెస్ట్సైడ్ షోరూమ్లో రూ.5689 విలువైన వస్త్రాలను కొనుగోలు చేశారు. తమ కంపెనీ లోగోతో ముద్ర వేసిన క్యారీ బ్యాగ్ను అందించి, దానికి రూ.10 వసూలు చేశారు. లోగో వేసిన క్యారీ బ్యాగుకు నగదు వసూలు చేసే విషయమై స్టోర్ మేనేజర్ను తేజ ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానంలేదు.
క్యారీ బ్యాగ్ తమ షోరూమ్ ఇవ్వదని కనీసం ఎక్కడా బోర్డు కూడా పెట్టకపోవటంతో తాను తీవ్ర అసౌకర్యానికి గురయ్యానని తేజ అదే ఏడాది జూలై 9న, షోరూం స్టోర్ మేనేజర్తో పాటు ముంబై, బాంద్రాలోని ప్రధాన కార్యాలయం సీఈవోలపై జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశా రు. కేసు విచారించిన ఫోరం అధ్యక్షులు తాడికొండ సునీత, సభ్యులు కుమ్మమూరు విజయలక్ష్మి, గుంటకల పున్నారెడ్డి స్టోర్ వ్యవహారశైలిని తప్పుపట్టారు. ఇక పై షోరూం లోగోతో వినియోగదారులకు ఉచితంగా క్యారీ బ్యాగులు అందజేయాలని ఆదేశించారు. ఫిర్యాది తేజ నుంచి క్యారీ బ్యాగ్ కోసం వసూలు చేసి రూ.పదితో పాటు రూ.6 వేలు, మానసిక క్షోభకు మరో రూ.3 వేలు ఆరు వారాల్లోగా చెల్లించాలని ఆదేశించారు.