అమరావతి, జనవరి 28 : జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రజాయాత్రలో భాగంగా అనంతపురంలో పర్యటించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీతతో భేటీ అయ్యారు. పవన్ కు మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్ ఎదురెళ్లి ఘనస్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో మంత్రితో పాటు సాగునీటి నిపుణులతో కలిసి హంద్రీనీవా ప్రాజెక్టుపై చర్చించారు. ఈ ప్రాజెక్టు వలన కలిగే లాభాలేంటి.?.. ఇది ఎప్పటిలోగా పూర్తవుతుందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
మంత్రి సునీతకు జిల్లా రైతు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రైతుల సమస్యలను తెలుసుకొని వాటిని ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తున్నానన్నారు. అందరిని కలుపుకుని కరువును పారద్రోలేందుకు కృషి చేస్తానన్న ఆయన.. త్వరలోనే రాయలసీమకు హైకోర్టుతో పాటు ఇతర అంశాలపై ప్రధానమంత్రిని కలిసి వివరించనున్నట్లు వెల్లడించారు. అనంతరం పరిటాల కుటుంబ సభ్యులతో కలిసి పవన్ అల్పాహారం తీసుకున్నారు.