హైదరాబాద్, జనవరి 30 : తత్కాల్ పాస్పోర్టుల జారీ విధానాన్ని భారత్ ప్రభుత్వం సరళీకృతం చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇక ముందు తత్కాల్ పాస్పోర్టుకై దరఖాస్తు చేసుకునే వారికి గెజిటెడ్ అధికారుల సిఫారసు అవసరం లేదని స్పష్టం చేశారు.
ఆధార్ కార్డు, వ్యక్తిగత పూచీకత్తుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏవైనా రెండు ధ్రువ పత్రాలు(ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, విద్యార్థి ఫొటో ఐడీకార్డు, పాన్కార్డు, బ్యాంకు, పోస్టాఫీస్ పొదుపు ఖాతా పుస్తకం, పింఛన్ డాక్యుమెంట్) జత చేస్తే సరిపోతుందని ప్రాంతీయ పాస్పోర్టు అధికారి(ఆర్పీవో) విష్ణువర్దన్రెడ్డి వెల్లడించారు.
ఈ పాస్పోర్టుల జారీలో దేశంలో కెల్లా హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా పోలీసుల ధృవీకరణ కోసం 23 రోజుల సమయం పడుతుండగా తెలంగాణలో మాత్ర౦ 5 రోజుల సమయం పడుతుందని ఆయన తెలిపారు.