ఏ దేశంలో అయినా క్రీడలలోనైనా ఆటగాళ్లకు జాతీయ జట్టుకు ఆడడం ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక ఆడిన ఆటల్లో గెలిస్తే పతకాలు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. దాంతో పాటు ప్రభుత్వం వారి నుండి ప్రోత్సహాకాల రూపంలో నగదు కూడా లభిస్తుంది. మరింకెన్నో అవకాశాలు క్రీడాకారుల తలుపులు తడతాయి. కానీ, వేల్స్ దేశంలో హాకీ ఆటగాళ్ల పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. వాళ్లు సొంతగా డబ్బులు చెల్లించి మరీ వేల్స్ దేశానికి ఆడుతున్నారు. ఇందుకోసం ఒక్కో ఆటగాడు ఏడాదికి వెయ్యి పౌండ్లు చెల్లించి వేల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒడిశా వేదికగా జరుగుతున్న హాకీ ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు వీరు సొంత ఖర్చులతో భారత్ వచ్చారు.
ఈ విషయాన్ని ఆ జట్టు కోచ్ డేనియల్ న్యూకోంబె తెలిపారు. తమ దేశంలో హాకీకి అంతగా ఆదరణ, ప్రాచుర్యం లేకపోవడం ఇందుకు కారణమని అన్నారు. దాంతో, ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం లభించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో భారత్ వచ్చేందుకు విమాన ప్రయాణం, వసతి, భోజన ఖర్చుల కోసం ప్రజల నుంచి విరాళాల రూపంలో 25 వేల పౌండ్లు సేకరించారు. ప్రపంచ కప్ తర్వాత అయినా తమ జట్టుకు ఆదరణ లభిస్తుందని కోచ్ డేనియల్ ఆశిస్తున్నారు. కాగా, ఈ టోర్నీలో వేల్స్.. భారత్, స్పెయిన్, ఇంగ్లండ్ తో కలిసి గ్రూప్–డి బరిలో నిలిచింది.