మహిళల ఐపీఎల్ బరిలో తెలుగు తేజాలు..

     Written by : smtv Desk | Wed, Feb 08, 2023, 03:55 PM

మహిళల ఐపీఎల్ బరిలో తెలుగు తేజాలు..

తొలిసారి టీమిండియా మహిళల క్రికెట్ జట్టు ఐపీఎల్ తరహాలో మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) కు రంగం సిద్ధం అవుతుంది. ఐదు జట్లతో తొలి సీజన్‌ మార్చి 4వ తేదీ నుండి ముంబైలో మొదలవనుంది. ఈ లీగ్ లో పాల్గొనే క్రికెటర్ల వేలం ఈ నెల 13న జరగనుంది. వేలం కోసం 1525 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కానీ, ఇందులో 409 మందిని మాత్రమే తుది జాబితాలో చేర్చినట్టు బీసీసీఐ ప్రకటించింది.
ఇక ఇందులో 264 మంది భారత క్రీడాకారిణులు ఉండగా, 163 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఐసీసీ అసోసియేట్‌ దేశాల నుంచి 8 మందికి చోటు దక్కింది. ఒక్కో జట్టులో 18 మంది చొప్పున ఐదు ఫ్రాంచైజీల్లో కలిపి 90 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 30 ఖాళీలను విదేశీ క్రికెటర్లకు కేటాయించారు. రూ. 10, 20, 30, 40, 50 లక్షల ప్రారంభ ధరల విభాగాల్లో క్రికెటర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
తెలంగాణ, ఆంధ్రకు చెందిన పలువురు క్రికెటర్లు కూడా వేలంలోకి రానున్నారు. ఇప్పటికే భారత మహిళల సీనియర్ జట్టుకు ఆడిన ఏపీ క్రీడాకారిణులు స్నేహ దీప్తి, అంజలి శర్వాణి, సబ్బినేని మేఘనతో పాటు హైదరాబాద్ క్రికెటర్ అరుంధతి రెడ్డి రూ. 30 లక్షల కేటగిరీలో వేలంలోకి వస్తారు. అండర్–19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఆడిన గొంగడి త్రిష, యశశ్రీతో పాటు హైదరాబాద్ నుంచి మదివాడ మమత, ప్రణవి, ఇషిత రూ. 10 లక్షల ప్రారంభ ధరలో నిలిచారు. అండర్ 19 ప్రపంచ కప్ జట్టు సభ్యురాలైన ఏపీ క్రికెటర్ షబ్నిమ్ కూడా ఇదే కేటగిరీలో వేలంలోకి రానుంది. ఆమెతో పాటు ఏపీకి చెందిన కట్టా మహంతిశ్రీ, వై. హేమ, బారెడ్డి అనూష, ఝాన్సీ లక్ష్మి, విన్నీ విన్నీ సుజన్.జి, శరణ్య, శ్రీచరణి రూ. 10 లక్షల విభాగంలో పేర్లు నమోదు చేసుకున్నారు.





Untitled Document
Advertisements