రాజకీయ నాయకులు అనుచితంగా ప్రవర్తించారు అనే అభియోగం రాగానే వారిని వారి యొక్క పదవుల నుండి తప్పిస్తారు. వారిపై వచ్చిన ఆరోపణలు నిజమైతే ఇక వారు పదవులకు దూరం కావాల్సిందే. అలా కాదు అవన్నీ ఉట్టి ఆరోపనలే తప్ప అవి నిజం కాదు అని నిరూపితం అయితే వారిపై విధించిన అనర్హత వేటుని ఎత్తివేస్తారు. సరిగ్గా అదే విధంగా లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ పై విధించిన అనర్హత వేటును లోక్ సభ ఈరోజు ఉపసంహరించుకుంది. అనర్హత వేటును ఉపసంహరించుకుంటున్నట్టు లోక్ సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 5న ఫైజల్ పై అండ్రోథ్ పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదయింది. ఈ ఏడాది జనవరి 11న ఫైజల్ తో పాటు మరో ముగ్గురుకి కోర్టు పదేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ క్రమంలో జనవరి 13 లోక్ సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసింది.
దీంతో ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారించిన కేరళ హైకోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ, లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఈ విషయంలో లోక్ సభ సెక్రటేరియట్ జాప్యం చేస్తూ వచ్చింది. దీంతో ఫైజల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు జరగడానికి కొన్ని గంటల ముందే లోక్ సభ సెక్రటేరియట్ వెనక్కి తగ్గింది. ఫైజల్ పై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ అనర్హతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాహుల్ విషయంలో కూడా ఏదైనా కీలక మలుపు చేసుకుంటుందేమో వేచిచూడాలి.