మధ్యప్రదేశ్ షాప్ యజమాని వింత పోస్టర్.. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు ఉద్దెర అడగొద్దు

     Written by : smtv Desk | Wed, Apr 19, 2023, 12:19 PM

మధ్యప్రదేశ్ షాప్ యజమాని వింత పోస్టర్.. రాహుల్  గాంధీ ప్రధాని అయ్యే వరకు ఉద్దెర అడగొద్దు

మనకి అత్యవసరంగా ఏవైనా సరుకులు లేదా వస్తువులు అవసరం అయినప్పుడు వెంటనే మనం దగ్గరలో ఉన్న కిరాణా దుకాణాలకు వెళ్లి కొనుక్కోవడం మనకు అలవాటు. అయితే మన జేబులో డబ్బులు ఉన్నప్పుడు వెళ్లి దర్జాగా డబ్బులు ఇచ్చి కావాల్సినవి కొనుక్కుంటాము. మరి కొన్ని సందర్భాలలో సమయానికి జేబులో డబ్బు లేనప్పుడు ఉద్దెర తీసుకుంటాము. అలా అడిగినప్పుడు షాపు యజమానులు మొహమాటానికి మనకు సరుకులు ఇస్తుంటారు. అయితే ఇలా ఫ్రీ సర్వీస్ చేసి ఇబ్బంది పడడం దేనికి అనుకున్న యజమానులు కొంతమంది వినూత్నంగా ఆలోచించు వారి దుకాణాలు, పాన్ షాపులలో ఉద్దెర ఇవ్వబోమనే పోస్టర్లు పెట్టుకోవడం సాధారణమే! అయితే, యజమానులు దీనిని రకరకాలుగా చెబుతుంటారు. ఉద్దెర రేపు అనో, కస్టమర్ మాకు దేవుడితో సమానం.. అలాంటి దేవుడికి అప్పిచ్చే స్థితిలో లేము అనో బోర్డులు పెడుతుంటారు. మధ్యప్రదేశ్ లో ఓ పాన్ షాప్ యజమాని మాత్రం తన షాపులో ఓ వింత పోస్టర్ పెట్టాడు. కాంగ్రెస్ మాజీ చీఫ్, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకూ ఉద్దెర ఇవ్వబోనంటూ పోస్టర్ పెట్టాడు. ఈ ఏడాది జనవరిలోనే పోస్టర్ పెట్టినా.. ఇటీవల ఓ కస్టమర్ ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

ఛింద్వారా జిల్లా కర్బాలా చౌక్ లో మహమ్మద్ హుస్సేన్ కు ఓ పాన్ షాప్ ఉంది. తెలిసిన వారే కదా అనే ఉద్దేశంతో గతంలో చాలామందికి ఉద్దెర ఇచ్చానని, వారు తిరిగివ్వకపోవడంతో నష్టపోయానని హుస్సేన్ వివరించాడు. దీంతో ఉద్దెర ఇవ్వబోనంటూ ఇలా వింత పోస్టర్ ను ఏర్పాటు చేశానన్నాడు. అయితే, రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేడన్నది తన అభిప్రాయం కాదని హుస్సేన్ తేల్చిచెప్పాడు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ప్రధాని సీట్లో కూర్చునే పరిస్థితి లేదని వివరించాడు. వాస్తవానికి రాహుల్ ప్రధాని కావాలన్నదే తన కోరిక అని హుస్సేన్ చెప్పాడు.





Untitled Document
Advertisements