నిన్న జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. వరుసగా అన్ని మ్యాచ్ లు గెలుస్తూ వచ్చిన టీమిండియా తుదిమజిలి చేరుకోవడంలో విఫలమైంది. అయితే సొంతగడ్డపై జరిగిన వరల్డ్ కప్ ను సాధించలేకపోవడం టీమిండియా ఆటగాళ్లను విపరీతమైన బాధకు గురిచేసింది. ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ ముగిశాక టీమిండియా క్రికెటర్లు కొందరు కన్నీటి పర్యంతమయ్యారు. కొందరు తీవ్ర నిరుత్సాహంతో కనిపించారు.
అహ్మదాబాద్ లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ ను ప్రధాని నరేంద్ర మోదీ కూడా వీక్షించారు. మ్యాచ్ అనంతరం మోదీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లారు. తీవ్ర విచారంతో ఉన్న ఆటగాళ్లను ఓదార్చారు. పేరు పేరునా పలకరిస్తూ వారితో మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోను రవీంద్ర జడేజా సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
"వరల్డ్ కప్ లో మేం సమున్నతంగా రాణించాం. కానీ నిన్నటి మ్యాచ్ లో ఓటమిపాలయ్యాం. మా మనసంతా వికలమైపోయింది. అయితే ప్రజల మద్దతుతో మాకు ఎంతో ఓదార్పు లభిస్తోంది. నిన్న మ్యాచ్ ముగిశాక ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూమ్ కు రావడం ప్రత్యేకమైన అనుభూతిని కలిగించింది. ఆయన రాక మాకెంతో ఉత్తేజాన్ని అందించింది" అంటూ జడేజా వివరించాడు.