దర్శకధీరుడి మనసు దోచుకున్న జపాన్ వీరాభిమాని కానుక

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 06:06 AM

దర్శకధీరుడి మనసు దోచుకున్న జపాన్ వీరాభిమాని కానుక

అందరు ముద్దుగా జక్కన్న అని పిలుచుకునే దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాని ప్రపంచస్థాయిలో నిలబెట్టిన ఘనత ఈయనది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నారు. జక్కన్న డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం జపాన్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఆ చిత్రం జపనీయులను విపరీతంగా ఆకట్టుకుంది. బాహుబలి-1, బాహుబలి-2 చిత్రాలతో జపాన్ లో క్రేజ్ సంపాదించున్న రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తో జపనీయుల హృదయాల్లో స్థానం దక్కించుకున్నారు.


కాగా, జపాన్ కు చెందిన ఓ వీరాభిమాని గురించి రాజమౌళి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
"జపాన్ ప్రజలు కాగితంతో కొంగ బొమ్మలు తయారుచేసి తమకు ఇష్టమైన వారికి కానుకగా ఇస్తారు. ఆ బొమ్మలు వారికి అదృష్టం, ఆరోగ్యం తెచ్చిపెడతాయని నమ్ముతారు. జపాన్ కు చెందిన ఈ 83 ఏళ్ల వృద్ధురాలు కూడా మమ్మల్ని ఆశీర్వదించేందుకు 1000 కొంగ బొమ్మలు తయారుచేసుకొచ్చింది. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆమెను ఎంతో సంతోషానికి గురిచేసిందట. ఆమె ఇప్పుడే మాకు ఒరిగామి బహుమతిని పంపింది. తను మాత్రం చలిలో బయటే వేచిచూస్తూ ఉండిపోయింది. కొన్ని చర్యలకు మనం కృతజ్ఞతలు చెప్పడం తప్ప తిరిగి ఏమివ్వగలం!" అంటూ రాజమౌళి వివరించారు. రాజమౌళి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.





Untitled Document
Advertisements