ఒకవైపు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఇటువంటి సమయంలో సరైన పత్రాలు లేకుండా డబ్బులు, నగలు మనతో పాటు తీసుకువెళ్ళడం నేరంగా పరిగనిస్తారు. ఇటువంటి సమయంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోట్ల రూపాయల బంగారం పోలీసుల తనిఖిలలో బయటపడింది. వివరాల్లోకి వెళితే.. మిర్యాలగూడలో కోట్లాది రూపాయల బంగారం పట్టుకున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నల్గొండ జిల్లా ఈదులగూడ చౌరస్తా వద్ద పోలీసులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మిర్యాలగూడ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో రూ.5.73 కోట్ల విలువ చేసే బంగారాన్ని గుర్తించారు. వాహనంలోని ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగారం, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం ఎవరిదీ? ఎక్కడికి తరలిస్తున్నారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.