ఒకవైపు మండే ఎండలు.. ఎండా వేడి బరించలేక అల్లాడిపోతున్న ప్రజలు. చివరి దశలో ఉన్న కొన్ని రకాల పంటలు. ఈ సమయంలో కోస్తాంద్రలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ సంస్థ (ఐఎండీ)భారీ వర్ష సూచన వెలువరించింది. ఈ నెల 20వ తేదీన కోస్తాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల 6 సెం.మీ నుంచి 12 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఝార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని ఐఎండీ పేర్కొంది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఎల్లుండి అల్లూరి సీతారామరాజు జిల్లా, కోనసీమ అంబేద్కర్ జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో ఉరుములు, పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఏలూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. అదే సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వాతారణ శాఖ హెచ్చరికల జారి మేరకు ప్రజలు ముందే జాగ్రత్త పడితే ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుంది.