హైదరాబాద్, ఫిబ్రవరి 18 : నగరంలోని జూబ్లీహిల్స్ లో శనివారం రాత్రి నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్లో ఓ హిజ్రా మద్యం మత్తులో హల్ చల్ చేసింది. ముగ్గురు స్నేహితులతో కలిసి వెళ్తున్న హిజ్రా కారును ట్రాఫిక్ పోలీసులు ఆపి తనిఖీలు చేశారు. హిజ్రా స్నేహితుడు మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుపడ్డాడు. దీంతో పక్క సీట్లో ఉన్న హిజ్రా ఒక్కసారిగా కారు నుంచి బయటకు వచ్చి ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియాపై దాడికి దిగి వీరంగం సృష్టించింది.
ఇదంతా చూస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఆమెను నిలువరించకపోవడం గమనార్హం. అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 43 మందిపై కేసులు నమోదు చేసి, సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించి మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.