చెన్నై, మార్చి 12 : తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. సాహసయాత్ర కోసం వెళ్లిన పలువురు అడవిలో కార్చిచ్చులో చిక్కుకొని అగ్నికి ఆహుతయ్యారు. చెన్నై నుంచి ఐటీ ఉద్యోగినులు, కళాశాల విద్యార్థినులు మున్నార్ ప్రాంతంలోని సూర్యనెల్లి నుంచి తేని జిల్లాలోని కురంగణి ప్రాంతానికి ఆదివారం పర్వతారోహణకు వెళ్లగా మంటల్లో చిక్కుకున్నారు. వారు అడవిలో ఉన్న సమయంలో మంటలు చెలరేగడంతో ఈ ఘటన సంభవించింది. ఈ దావాగ్నికి 9 మంది బలయ్యారు.
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా పర్వతారోహణకు వెళ్లిన వారు పోలీసుల నుండి గానీ, అటవీ శాఖ అధికారుల నుండి గానీ అనుమతి తీసుకోలేదని సీనియర్ పోలీసు అధికారి వివరించారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి సీఎం ఎడప్పాడి పళనిస్వామి వెల్లడించారు.