హైదరాబాద్, మార్చి 12 : నగరంలోని కూకట్పల్లిలో ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా వేట కొడవళ్ళతో నరికి చంపేశారు. అతని కోసం కాపు కాసి ఉన్న నలుగురు యువకులు కనీసం స్నేహితుడని కూడా చూడకుండా వెంటాడి మరి వేట కొడవళ్ళతో వేటు చేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సుధీర్ అనే యువకుడు కూకట్పల్లిలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
ఈరోజు ఉదయం యథావిధిగా ఇంటర్ పరీక్షలు రాసేందుకు తన స్నేహితులు మేఘనాథ్, సాయిలతో కలిసి బైక్పై వచ్చిన సుధీర్.. కూకట్పల్లి జేఎస్పీ హోండా షోరూం వద్దకు చేరుకోగానే నలుగురు దుండగులు సుధీర్ను అడ్డగించి వేట కొడవళ్ళతో దాడి చేశారు. వారి వద్ద నుండి తప్పించుకొని పారిపోతున్నా వెంటాడి మరి నరికేశారు. వారిని అడ్డుకోబోయిన తన స్నేహితులపై దాడికి దిగడంతో వారు అక్కడి నుండి పారిపోయారు.
హత్య చేసి పారిపోతున్న నలుగురిని అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డ్ పరమేష్ వెంటపడి ఒకరిని పట్టుకున్నాడు. స్థానికులు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అన౦తరం మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మూసాపేటలో నివసించే కృష్ణ, మహేష్, తేజ, నవీన్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.