హైదరాబాద్, మార్చి 14 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తెలంగాణ అంశాన్ని లేవనెత్తారు. "సెంటిమెంట్కు డబ్బులు రావని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఓ మాట అన్నారు.. కానీ ఆయన ఒకటి గుర్తుంచుకోవాలి. సెంటిమెంట్ కోసమే 'తెలంగాణ' రాష్ట్రాన్ని ఇచ్చారు" అంటూ వ్యాఖ్యానించారు.
ఈ మాటకు సమాధానంగా కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. "సర్.. మీ రాష్ట్ర హక్కుల కోసం పోరాడడంలో తప్పులేదు. అంతేకాని తెలంగాణ ప్రజల పోరాటాన్ని, త్యాగాలను తక్కువ చేసి మాట్లాడవద్దు. మేము మా ప్యాకేజీల కోసం రాష్ట్రాన్ని కోరుకోలేదు. అది మా హక్కు" అంటూ ఘాటుగా స్పందించారు.