ముంబై, ఏప్రిల్ 18 : మ్యాచ్ ఏదైనా.. ఫార్మాట్ ఏదైనా.. కోహ్లి అడుగుపెట్టానంతే వరకే.. ఒక్క సారి విరాట్ బరిలోకి దిగితే రికార్డులన్ని తన వశం కావాల్సిందే. తాజాగా ఐపీఎల్ లో భాగంగా రన్ మెషీన్ కోహ్లి రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. టోర్నీలో భాగంగా మంగళవారం ముంబయి ఇండియన్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో కోహ్లీ 92 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. దీంతో ఈ ఐపీఎల్ లో 4619 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో సురేశ్ రైనా అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా కోహ్లీ అతడిని వెనక్కి నెట్టేశాడు.
ఆర్సీబీ తరఫున కోహ్లీ ఇప్పటి వరకు 5,043 పరుగులు సాధించాడు. ఐపీఎల్, ఛాంపియన్ లీగ్ టీ20 కలిపి 5వేలకు పైగా పరుగులు సాధించిన తొలి ఆటగాడు కూడా కోహ్లీనే. ఐపీఎల్ ఆరంభం నుండి కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఒక ఫ్రాంఛైజీ తరఫున అత్యధిక పరుగుల సాధించిన ఆటగాడు కూడా కోహ్లీనే కావడం విశేషం. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా 4,558 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ (4,345), గౌతమ్ గంభీర్ (4,210) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.