భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పరిశోధనా పరంగా అంతరిక్షంలో దూసుకుపోతుంది. తాజగా ఇస్రో మరో ఘనతను సాధించింది. ఈ నెల 1వ తేదీన పీఎస్ఎల్వీ సీ58తో పాటు నింగిలోకి పంపిని ఫ్యూయల్ సెల్ ను విజయవంతంగా పరీక్షించింది. దాని నుంచి డేటాను సేకరించడంతో పాటు, పనితీరును విశ్లేషించింది. భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాల కోసం దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ గా దీన్ని వ్యవహరిస్తున్నారు. ఈ ఫ్యూయల్ సెల్ రసాయనిక చర్యను జరిపి, విద్యుత్ ను ఉత్పత్తి చేసి, కేవలం నీటిని మాత్రమే వదులుతుంది. ఆక్సిజన్, హైడ్రోజన్ లతో రసాయనిక చర్య జరిపి 180 వాట్ల శక్తిని విడుదల చేస్తుంది.