గురువారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై వారి నడుమ చర్చ జరిగింది. రేవంత్ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సంసిద్ధతను వ్యక్తం చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిరంగాన్ని ప్రభావితం చేస్తోందని... వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటలైజేషన్ అజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావడంతో పాటు తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి నాణ్యమైన సేవలను అందించేందుకు విస్తృతమైన సాంకేతికత, నైపుణ్యం తమ వద్ద ఉందని ముఖ్యమంత్రికి చంద్రశేఖర్ తోట వివరించారు.
ఈ సందర్భంగా గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్ ఫారమ్లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రతపై కూడా ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు కుడా పాల్గొన్నారు.